భర్త లేని సమయంలో ఇంటి యజమాని వేధింపులు: వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి మెడికల్ సొసైటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన భర్త లేని సమయంలో ఇంటి యజమాని వేధింపులకు గురిచేస్తుండటంతో ఓ వివాహత బలవన్మరణానికి పాల్పడింది. తన ఆత్మహత్యకు ఇంటి యజమాని వేధింపులే కారణమని తన సూసైడ్ నోట్లో పేర్కొంది.
సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి మెడికల్ సొసైటీలోని ప్రసన్నకుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత(28) దంపతులు రెండున్నర సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు, ఏడాది పాప ఉన్నారు.
కాగా, పిల్లలు గొడవ చేస్తున్నారంటూ ఇంటి యజమాని తరచూ ఆమెతో గొడవపడేవాడని సుజాత బంధువులు చెబుతున్నారు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటి యజమాని గొడవకు దిగడంతో మనస్తాపానికి గురైన సుజాత ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ఆత్మహత్యకు ఇంటి యజమాని వేధింపులే కారణమని సుజాత తన సూసైడ్ నోట్లో పేర్కొంది. గోడలు, తలుపులపైన కూడా ఇంటి యజమాని వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.