బాగాలేదని ప్రియుడు నో, ప్రియురాలు ఫిర్యాదు
హైదరాబాద్/ఖమ్మం: తనను ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయత్రి నగర్ బోడుప్పల్కు చెందిన కిరణ్, బోయబస్తీకి చెందిన యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ నెల 20వ తేదీన సనత్ నగర్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
అందుకు కావాల్సిన పత్రాలను వారు సమకూర్చుకున్నారు. తర్వాత ప్రేమికురాలి ప్రవర్తన బాగా లేదని, కించపరుస్తూ ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
అత్యాచారం కేసులో బాలికకు వైద్య పరీక్షల నిరాకరణ
నిర్భయ కేసుకు సంబంధించి ఓ గిరిజన బాలికకు వైద్యం, పరీక్షలు చేయడానికి నిరాకరించిన ఓ ఆసుపత్రి వైద్యురాలుపై బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మానుకోట శివారు భవానినగర్ తండాకు చెందిన ఓ బాలికను అదే తండాకు చెందిన బీటెక్ విద్యార్థి సురేశ్ (21)పెళ్లి పేరిట నమ్మించి ఐదు నెలల గర్భవతిని చేశాడు.
బాలిక తల్లి ఫిర్యాదుతో సురేశ్పై ఈ నెల 20న నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు బాలికను వైద్యం, పరీక్షల నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి అదే రోజు తరలించారు. కాగా, మహిళా వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మరో ఆసుపత్రికి రెఫర్ చేశారు.
మంగళవారం ఆ బాలికను మహిళా పోలీసు ఆస్ప త్రికి తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆ బాలికకు వైద్యం, పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించారు.
జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉండడం వల్ల తాను అన్ని కేసులు తీసుకోనని, ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూడాలని పై అధికారులు చెప్పారంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి బాలికను తిప్పి పంపారు. దీంతో బాలికకు వైద్యం, పరీక్షలకు నిరాకరించిన సీకేఎం వైద్యురాలుపై 166 (బీ) క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 రెడ్విత్ 357 సీఆర్పీసీ అండ్ సెక్షన్ 201 ఐపీసీ కేసు నమోదు చేశారు.
విహారంలో విషాదం
ఖమ్మంలో విషాదం చోటుచేసుకొంది. కులుమనాలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నెల్లూరు రవితేజ(19) ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ బిట్స్పిలానీలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న రవితేజ.. కళాశాల తరపున 21మంది రెండో సంవత్సరం విద్యార్థులతో కలిసి నాలుగు వాహనాల్లో బుధవారం కులుమనాలి వెళ్లారు.
కులుమనాలికి పైన ఉండే రోహన్పార్కుకు రవితేజ అతడి మిత్రుడు రఘురామిరెడ్డి ఒక బైక్ను అద్దెకు తీసుకొని వెళ్లారు. ఆ మార్గంలో ప్రమాదానికి గురై రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. రఘురామి రెడ్డికి గాయాలయ్యాయి. రవితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.