విజిలెన్స్ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న మహిళ
మహబూబాబాద్: విజిలెన్స్ అధికారినంటూ చెప్పుకుంటూ మానుకోట జిల్లా కేంద్రంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేస్తూ అక్రమంగా వసూళ్లు చేస్తూ అడ్డంగా ఓ మహిళ దొరికిన సంఘటన బుధవారం అంగన్వాడీ కేంద్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్ జిల్లా గుండ్ల సింగారానికి చెందిన మాజీ అంగన్వాడీ కార్యకర్త బి. సరోజన వితంతురాలు.
తను ఇంతకుముందు అంగన్వాడీ కార్యకర్తగా పని చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ విజిలెన్స్ అధికారినంటూ అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడింది. తను సీఎం కార్యాలయం నుండి స్పెషల్ విజిలెన్స్ ఆఫీసర్గా ఏర్పాటు చేశారంటూ మానుకోట జిల్లా కేంద్రంలోని బుక్కబజార్, చేపల మార్కెట్, బెస్తబజార్ అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడం మొదలుపెట్టింది.
అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా లేదంటూ అంగన్వాడీ కార్యకర్తలను, టీచర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ.. పలు కేంద్రాల్లో వసూళ్లు కూడా చేసింది. అంగన్వాడీ నియమ నిబంధనల ప్రకారం తనిఖీలకు వచ్చిన అధికారి ఎవరైనా ఆ అంగన్వాడీ కేంద్రాల్లో రిజిష్టర్లో సంతకం చేయాలి. ఆమె అలా చేయకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఆమెను పట్టుకుని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీడీపీఓ నిర్మలను వివరణ కోరగా సరోజన అనే మహిళ మతిస్థితమితం కోల్పోయి ఇలా చేస్తోందని తెలిపారు. ఎవరైనా సరే అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.