టిఫిన్ తిన్నాక తెలిసింది.. అది పాము చట్నీ అని: లబోదిబోమంటూ పరుగులు!..
వంట చేసే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా.. తీరా తినే సమయానికి కంచంలో ఏ బల్లో.. బొద్దింకో దర్శనమివ్వడం ఖాయం. శుచీ శుభ్రత ఉండాలంటే.. పాత్రలను శుభ్రంగా కడగడమే కాదు, వంట చేసేటప్పుడు అందులో ఏమి పడకుం
వనపర్తి: వంట చేసే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా.. తీరా తినే సమయానికి కంచంలో ఏ బల్లో.. బొద్దింకో దర్శనమివ్వడం ఖాయం. శుచీ శుభ్రత ఉండాలంటే.. పాత్రలను శుభ్రంగా కడగడమే కాదు, వంట చేసేటప్పుడు అందులో ఏమి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఇలాంటి జాగ్రత్తలేవి తీసుకోకపోవడం వల్ల తాజాగా ఓ కుటుంబం ఏకంగా పాము చట్నీ తినాల్సి వచ్చింది. టమాటో చట్నీ అని కడుపునిండా ఆరగించిన ఆ కుటుంబం.. చివరకు తాము తిన్నది పాము చట్నీ అని తెలుసుకుని లబోదిబోమన్నారు. ఆసుపత్రికి పరుగులుపెట్టి.. పరీక్షలు చేయించుకున్నారు. అయితే అది విషపూరిత పాము కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గొల్ల రాజమ్మ అనే మహిళ ఉదయాన్నే చట్నీ కోసం టమోటాలు, మిరపకాయలు ఉడికించింది. అనంతరం చట్నీ నూరేందుకు రోట్లో వేసి పచ్చడి కింద మెత్తగా దంచింది. అయితే అప్పటికే ఆ రోట్లో ఓ పాము పిల్ల ఉండటాన్ని రాజమ్మ గమనించలేదు. పచ్చడి కింద నూరి.. గ్రైండ్ చేయడంతో.. పాము కూడా చట్నీలో మెత్తగా కలిసిపోయింది.
చట్నీ చేశాక ఇంటిల్లిపాదీ దాంతోనే టిఫిన్ భుజించారు. గొర్రెల మంద దగ్గర కావలిగా ఉన్న పెద్ద కుమారుడు సాయికి కూడా తీసుకెళ్లారు. చట్నీ వేసుకుని టిఫిన్ తింటున్న తరుణంలో.. సాయికి ఓ పాము తోక కనిపించింది. చట్నీని సరిగ్గా పరిశీలించగా.. అందులో పాము ముక్కలు చిన్న చిన్నవిగా కనిపించాయి. దీంతో అసలు విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు..ఆఘమేఘాల మీద ఆసుపత్రికి పరుగుతీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారు. చట్నీలో పచ్చడైన పాము విషపూరితమైంది కాకపోవడంతోనే వీరికి ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.