ఇంట్లోనే మహిళపై అత్యాచారం, ఆపై హత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 49 ఏళ్ల ఆమె ఇంట్లోనే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దముల్ గ్రామంలో బుధవారంనాడు జరిగింది.
ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత పిల్లలు పెళ్లి చేసుకుని బయటకు వెళ్లిపోయారు. దాంతో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. బుధవారం ఉదయం ఓ బంధువు ఆమెను చూడడానికి రావడంతో సంఘటన వెలుగు చూసింది. మంగళవారం రాత్రి ఆమెను చంపేసి ఉంటారని, బధువు ఇంటికి వచ్చి చూసే వరకు కూడా ఆ విషయం ఎవరికీ తెలియలేదని పోలీసులు చెప్పారు.
తువ్వాలతో ఆమె గొంతుకు ఉరేసినట్లు అనవాళ్లున్నాయి. ఉరేసిన సమయంలో ఆమె పెనుగులాడినట్లు కూడా అర్థమవుతోంది. ఆమె దుస్తులు విప్పేసి ఉన్నాయని, నోటి నుంచి రక్తం వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆగంతకుడు తలుపులు తెరిచే ఉంచాడు.
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు చెందిన హతురాలు కొన్నేళ్ల క్రితం పెద్దముల్కు వచ్చి స్థిరపడింది. ఆమె కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఆమెకు పరిచతులెవరైనా ఉన్నారా, ఆమె ఇంటికి తరుచుగా వస్తూ వెళ్లేవారు ఎవరనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.