కెసిఆర్ను కలవనీయడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: సచివాలయం వద్ద మంగళవారం నాడు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్చన వ్యాపారం చేసి ఆర్థికంగా చితికిపోయింది. తనకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి విన్నవించుకోవాలని ప్రయత్నించింది.
మంగళవారం నాడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయానికి వచ్చింది. ఆమెను అడ్డుకోవడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
6న స్పీకర్, 7న గవర్నర్ ఢిల్లీ పర్యటన
ఈ నెల 6వ తేదీన సభాపతి మదుసూదనా చారి, 7వ తేదీన గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు
మున్సిపల్ కార్మికుల సమ్మెకు తాము మద్దతు ఎప్పుడూ ఉంటుందని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి చెప్పారు. నెల రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఆలోచన లేదు: మహేందర్ రెడ్డి
ఆర్టీసీ ఛార్జీలు ఇప్పట్లో పెంచే అవకాశం లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ బస్సు ఛార్జీలు తక్కువగా ఉన్నా ప్రజలపై భారం మోపే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో హెల్మెట్లు తప్పనిసరి చేసే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.