ఎంత పనిచేశావ్ యండమూరీ! ఉతికారేస్తున్నారుగా ఫేస్ బుక్ లో..
హైదరాబాద్ : తెలంగాణపై అక్కసో.. లేక నాస్తిక భావజాలమో గానీ.. ప్రముఖ రచయిత యండమూరీ వీరేంద్రనాథ్ ఇప్పుడు తెలంగాణ పాలిట శత్రువు అయిపోయారు. తెలంగాణ ప్రభుత్వాన్ని.. ఇక్కడి దేవుళ్ల ప్రాచుర్యాన్ని కించపరిచేలా కామెంట్స్ చేసిన యండమూరీని తెలంగాణ వాదులంతా ఫేస్ బుక్ లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.
ఇంతకీ ఆయనేమన్నారంటే.. యథాతథంగా ఆయన మాటల్లో..
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం అయ్యారు :
" తిరుపతికి కోట్ల కోట్ల ఆదాయం వెళ్లిపోతుంది. మన ఇంజనీర్లు నల్గొండ జిల్లాలో నాలుగు కొండలు గుర్తించారు. ఏ దేవుడు తొందరగా పాపులర్ అవుతాడో మన ఆగమ పండితులతో కలిసి పదిరోజుల్లో నిర్ణయిద్దాం. తవ్వకాల్లో దొరికినట్టు ఒక విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టాపించండి. ముందు చిన్నగుడి కట్టండి, ఆపై నెమ్మదిగా ఒక పెద్ద గుడి నిర్మించండి.. ఆ 'నలుగు కొండల దేవుడి' లీలలు దావానంలా వ్యాపించాలి. కథలు సృష్టించండి. పాపులారిటి పెంచండి. పుష్కరాల్లాంటి పదాలు కొత్తగా వెతకండి. టి.విలో ప్రవచనాలు చెప్పే వారిని నియమించండి. ఇదంతా ప్రాచుర్యం చేయడానికి మీకు మూడు సంవత్సరాలు టైం ఇస్తున్నాను. వంద కోట్లు శాంక్షన్ చేస్తున్నాను'. సమావేశం ముగిసింది.
ఇదీ ఫేస్ బుక్ లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి యండమూరీ పెట్టిన పోస్టు. ఈ పోస్టు చూడగానే అగ్గిమీద గుగ్గిలమైన తెలంగాణ వాదులు సహజంగానే యండమూరీ ఫేస్ బుక్ పోస్టు మీద దండయాత్ర చేశారు. దెబ్బకు.. పెట్టిన పోస్టును ఎడిట్ చేసి.. 'తెలంగాణకు బదులు తమిళనాడు అని మార్చి.. దానికి 2022 అని జతచేసి.. నల్గొండ స్థానంలో మహాబలిపురంను తెచ్చిపెట్టారు యండమూరీ. పాపం.. ఆయన గుర్తించని విషయమేంటంటే.. అప్పటికే పలువురు తెలంగాణ వాదులు ఆయన పోస్టులను గుర్తించి బట్టబయలు చేశారు'.
దీంతో.. చివరాఖరికి "గుడి కట్టి భగవంతుణ్ణి కాష్ చేసుకోవటం గురించి కొందరు హర్ట్ అయ్యారని తెలిసి, అ పోస్ట్ తీసేస్తున్నాను. క్షమాపణలు." అంటూ వివాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు యండమూరీ. ఇక్కడితో ఆగిపోలేదు గొడవ.. ఇన్నాళ్ల పేరునంతా ఒకేసారి గంగలో కలిపేసుకున్నట్టు.. యండమూరీ గతాన్నంతా తవ్వుతూ.. 'అసలు యండమూరీ రచనల్లో క్రెడిట్ అంతా ఆయన వద్ద పనిచేసిన ఘోస్ట్ రైటర్లదేనని.. ఇంగ్లీష్ నవలలను కాపీ కొట్టేసి తెలుగులో వాటిని అనువదించుకుని.. తానే మూల రచయితనను అన్నట్టు బిల్డప్ కొట్టారని..' ఇలా.. రకరకాలుగా ఇప్పుడు యండమూరీపై విమర్శల వర్షం కురుస్తోంది.