గెలిచి తెరాసలోకి వెళ్లారు, వేటేయండి: టీ జగన్ పార్టీ
హైదరాబాద్: పార్టీ ఫిరాయించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), మదన్లాల్ (వైరా)లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
సభాపతిని కలిసిన వైసీపీ నేతల్లో శివకుమార్, యడ్మ కిష్టారెడ్డి వినతి పత్రం సమర్పించారు. సోమవారం స్పీకర్ను కలిసిన వారు తమ పార్టీ గుర్తుపై గెలిచి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
సమాన హక్కుల కోసం ప్రభుత్వం కృషి చేయాలి: కోదండరాం
రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించి తెలంగాణ ప్రజలకు న్యాయం కల్పించటంలో సీమాంధ్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం టీజేఏసీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో అందరికీ సమాన హక్కులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నేతలు జి.దేవీప్రసాదరావు, మమత, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.