టీవి9 ను ఆ సంస్థ కొనుగోలు చేయనుందా? డీల్ ఎంతకి?
హైదరాబాద్ : న్యూస్ ఛానెల్స్ అనగానే.. తెలుగునాట మొదట గుర్తొచ్చే పేరు టీవి9. తెలుగులో మొట్టమొదటి న్యూస్ ఛానెల్ గా ప్రారంభమైన టీవి9 ఇప్పటికీ తెలుగు మీడియాలో నంబర్.1 గానే కొనసాగుతోంది. టీవి9 ను అనుసరించి మరెన్నో కొత్త న్యూస్ ఛానెల్ ప్రారంభమైనా.. వాటన్నింటిని నిలువరించి మరీ టీవి9 నేటికి మొదటి స్థానంలోనే కొనసాగుతుండడం విశేషం.
టీవి9 సీఈవో రవిప్రకాశ్ నేత్రుత్వంలో నేటికి టీవి9 బ్రాండ్ అలాగే కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, తెలుగునాట ఇంత ప్రాచుర్యం పొందిన ఈ ఛానెల్ పై ఇప్పుడో జాతీయ మీడియా కన్ను పడినట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ జీ గ్రూప్.. టీవి9 ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.
ఈ నేపథ్యంలో టివి9 ను నిర్వహిస్తోన్న అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) తో ఇప్పటికే జీ గ్రూప్ మంతనాలు సాగించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏబీసీఎల్ లో అత్యధిక వాటాలు కలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు (పీపుల్స్ క్యాపిటల్) కు రూ.850కోట్లను జీ గ్రూప్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది.
కాగా, టీవి9తో పాటు జైతెలంగాణ ఛానెల్ మరియు కన్నడ, మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ సహా మొత్తం 7 ఛానల్స్ ను ఏబిసీఎల్ నిర్వహిస్తోంది. గతంలోను టివి9తో సహా ఏబీసీఎల్ యాజమాన్యం కింద ఉన్న ఈ 7 ఛానెల్స్ ను కొనుగోలు చేసేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. అయితే ఆ ఒప్పందాలేవి సఫలం కాలేదు. తాజాగా మళ్లీ ఆ ప్రయత్నాలను జీ గ్రూప్ కొనసాగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి.. టీవి9 సహా ఏబీసీఎల్ ఛానెల్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంటుందో! లేక ఇదంతా వార్తలకే పరిమితమవుతుందో..!