అమెరికాలో జంట హత్యలు: దోషిగా తేలిన తెలుగు టెక్కీ
న్యూయార్క్: రెండేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో అమెరికాలోని మాంట్గోమరి కౌంటీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. పదినెలల చిన్నారి, ఆమె అమ్మమ్మ హత్య కేసులో ప్రవాస తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కోర్టు దోషి తేల్చింది. అయితే అతనికి ఇంకా కోర్టు శిక్షను ఖరారు చేయలేదు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు యండమూరి రఘునందన్(28)కు మరణ శిక్ష విధించాలని యుఎస్ అటార్నీ కోర్టును కోరారు. ఇద్దరు తెల్లజాతీయుల సహాయంతో రఘునందన్ ఈ రెండు హత్యలను చేసినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
2012, అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో నివాసం ఉంటున్న సాన్వీ వెన్న అనే చిన్నారి కిడ్నాప్కు యత్నించిన రఘునందన్, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్న(61) అడ్డుకోవడంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత చిన్నారిని కూడా హతమార్చాడు. ఈ రెండు హత్యలు డబ్బుల కోసం చేసినట్లు తెలిసింది. హత్యకు గురైన వారు నిందితుడికి పరిచయం ఉన్నవారే కావడం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం.. 2007లో హెచ్-1బి వీసా మీద ఎంఎస్ చేసేందుకు రఘునందన్ అమెరికా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత జూదానికి అలవాటుపడ్డాడు. అంతేగాక జూదం కోసం 20,000డాలర్ల అప్పులను కూడా చేశాడు. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం దొంగతనాలు దోపిడీలు చేసేందుకు కూడా సిద్ధపడ్డాడు. ఇద్దరు తెల్లజాతీయులు శాన్వీని కిడ్నాప్ చేయమని కోరడంతో డబ్బులకు ఆశపడి అందుకు అంగీకరించానని పోలీసుల విచారణలో రఘునందన్ తెలిపాడు.
సాన్వీని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన రఘునందన్ను సత్యవతి అడ్డుకోవడంతో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత సాన్వీని గొంతునులిమి చంపాడు. ఇద్దర్నీ ఓ సూట్కేసులో పెట్టి దాచేశాడు. అయితే ఇదంతా సిసిటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ సిసిటీవీ ఫుటేజీలో రఘునందన్ చెప్పినట్లుగా ఇద్దరు తెల్లజాతీయులు ఎవరూ లేరని పోలీసులు గుర్తించారు.
మొదట నేరాన్ని అంగీకరించిన రఘునందన్.. ఆ తర్వాత పోలీసుల ఒత్తిడితోనే నేరాన్ని అంగీకరించాల్సి వచ్చిందని తెలిపాడు. ఇద్దరు తెల్లజాతీయుల వల్లే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పాడు. కాగా, హత్య కేసులో రఘునందన్ అరెస్ట్ కావడంతో గర్భవతి అయిన అతని భార్య కోమలి భారతదేశానికి వచ్చేసింది.
డిఎన్ఏ, సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా కోర్టు రఘునందన్ను హత్య కేసులో నిందితుడిగా తేల్చింది. కాగా, కోర్టు తీర్పు విన్న అతని తల్లి పద్మావతి అక్కడే కుప్పకూలిపోయింది. తమ కుమారుడ్ని శిక్ష నుంచి కాపాడాలని కోర్టును వేడుకుంది. తన భర్త మావోయిస్టుల కాల్పుల్లో మరణించాడని, అప్పుడు రఘుకి పదేళ్ల వయస్సు ఉంటుందని ఆమె తెలిపింది. తండ్రి మృతితో అతడు రాత్రుల్లు సరిగా నిద్రపోయేవాడు కాదని, ఓసారి ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డాడని తెలిపింది. అనేక మందులు వాడిన తర్వాత అతడు మామూలుగా మారాడని చెప్పింది. దయచేసి తన కుమారుడ్ని కాపాడాలని వేడుకుంది.