థాయిలాండ్లో హైదరాబాద్ యువ జంట మృతి (ఫోటో)
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన యువ దంపతులు థాయిలాండ్లో మృత్యువాత పడ్డారు. విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదం నింపారు. నగరానికి చెందిన పారిశ్రామిక వేత్త (సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యశ్ అగర్వాల్ (27), పంకూరి మిఠల్ (26) దంపతులు.
ఈ నెల 2న వీరిద్దరు విహార యాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం థాయిలాండ్లోని పాపులర్ బీచ్లలో ఒకటైన ఓ నాంగ్ బీచ్కి వెళ్లారు. తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా అగర్వాల్ దంపతులు బోట్లో సముద్రంలోనికి వెళ్లారు.
వాతావరణ పరిస్దితి బాగా లేకపోవడంతో బోటును వెనక్కి మళ్లించారు. తీరానికి కొద్ది దూరంలో ఉండగా బోటు తిరగడబడడంతో యువ జంట మునిగింది. ఓ గంట తర్వాత ఇద్దరి మృతదేహాలు నీటితో తేలుతూ కనిపించాయి.
ఒక్కగానొక్క కుమారుడు, కోడలు మృత్యువాతపడడంతో మహేంద్ర అగర్వాల్ నివాసంలో విషాదం నెలకొంది. వివాహమై ఏడాదిన్నర గడవకముందే ఈ యువ జంట మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర బాధను మిగిల్చింది.
బోట్ ఆపరేటర్ ఎక్కాపోంగ్ కింగ్లెక్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే యువ జంట మృత్యువాతన పడ్డారని అతనిపై థాయ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం చెప్పారు. లైఫ్ జాకెట్లను బోట్ ఆపరేటర్ ధరించమని అడినా వారు వాటిని ధరించడానికి నిరాకరించారని పోలీసులు తెలిపారు.