గాంధీ జయంతి సందర్బంగా నార్త్ టెక్సాస్ లో 'పీస్ వాక్'
నార్త్ టెక్సాస్ : అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని 147వ గాంధీ జయంతి వేడుకలను నార్త్ టెక్సాలో ఘనంగా నిర్వహించబోతున్నట్టు నార్త్ టెక్సాస్ మహాత్మ గాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ తోటకూర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి వేడుక సందర్బంగా.. ఉదయం 8గం.లకు 'గాంధీ శాంతి నడక' (గాంధీ పీస్ వాక్) చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.
డల్లాస్ లోని మహాత్మాగాందీ మోమోరియల్ ప్లాజా నుంచి మొదలయ్యే ఈ శాంతి నడక.. నార్త్ టెక్సాస్ ఇండియన్ అసోసియేషన్ వద్దకు చేరుకోనుంది. గాంధీ పీస్ వాక్ కోసం ఎవరైతే ముందుగా వేదిక వద్దకు వస్తారో.. వారికి టీ షర్టులు, టోపీలు పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం అల్పాహారం అందజేయనున్నారు.
కాగా, కార్యక్రమం సందర్బంగా శాంతికి చిహ్నాంగా కొన్ని పావురాలను గాల్లోకి ఎగరవేయనున్నట్టు నిర్వాహుకులు తెలియజేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారంతా శాంతిని సూచించే తెలుపు వస్త్రాల్లో రావాలని సూచించారు. వాహనాల్లో వచ్చేవాళ్ల కోసం నార్త్ లేక్ కాలేజీ వద్ద ఉచిత పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని పిలుపునిచ్చారు.
ఉదయం గాంధీ పీస్ వాక్ ముగిశాక.. సాయంత్రం 5గం.ల నుంచి 9గం.ల వరకు శాఖాహార విందు భోజనం ఏర్పాటు చేయనున్నారు. డల్లాస్ లోని సెంట్రల్ ఎక్స్ ప్రెస్ దారిలో ఉన్న పార్క్ ప్లాజా టవర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. పూర్తి శాఖాహార విందు భోజనం మరియు మద్యపానానికి తావు లేని కార్యక్రమంగా ఈవెంట్ కొనసాగనుంది.
ఇకపోతే గాంధీ జయంతిని పురస్కరించుకుని ' ప్రస్తుత ప్రపంచంలో మహాత్మాగాంధీ అహింసమార్గం యొక్క ఔచిత్యం' అనే అంశంపై జూనియర్లు, సీనియర్ల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్టు నిర్వాహుకులు తెలియజేశారు. విజేతలకు పార్క్ ప్లాజా వేదికగా బహుమతులు అందించనున్నారు.
కాగా, మహాత్మాగాంధీ మునిమనవరాలు శ్రీమతి అర్చన గాంధీ ప్రసాద్ ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతుండడం విశేషం. విప్రో సీఈవో అబిదాలి నీముచ్ వాలా కూడా పార్క్ ప్లాజా వేదికగా జరగనున్న కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారు. వివరాలకు తోటకూర ప్రసాద్ - 8173004747.