డల్లాస్లో 'మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజా'
న్యూఢిల్లీ: అమెరికా చరిత్రలో ఎంతో మంది భారతీయుల కల నిజమైన రోజు అక్టోబర్ 2. అందుకు కారణం డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాల్లస్లోని ఇర్వింగ్ సమీపంలోని థామస్ జెఫర్సన్ పార్క్లో మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజాను ఆవిష్కరించారు. టెక్సాస్లో ఇది ఒక చరిత్రాత్మక సంఘటన. బాపూజీ జయంతైన అక్టోబర్ 2న ఈ ప్లాజాను ఆవిష్కరించారు.
వేలాది మంది భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య గాంధీజీ ముని మనుమడు సతీష్ ధుపేలియా మహాత్మా గాంధీ ప్లాజాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మట్లాడుతూబాపూజీ మార్గమే అందరం అనుసరించవలసిన సన్మార్గం మార్గం అని అన్నారు. మహాత్ముని ప్రవచాలను మనందరం ప్రపంచానికి చాటాలన్నారు.
డాల్లస్లోని థామస్ జెఫర్సన్ పార్క్లో బాపూజీ జయంతి నాడు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ మహాత్ముని బాటలో ముందుకు నడవడంవల్ల ప్రపంచం మరింత ఆనందంగా ఉండగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు గాంధీ మార్గమే సరైన పరిష్కార మార్గం అని హ్యూస్టన్లో భారత కాన్సులేట్ జనరల్ పర్వతనేని హరీష్ చెప్పారు. అనేక దేశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని, దానివల్ల ఎంతో విధ్వంసం జరుగుతున్నదని, ఆ విధ్వంసానికి సరైన సమాధానం బాపూజీ బోధలేనని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించిన మెమోరియల్ ప్లాజా కమిటీ ఛైర్మన్ డాక్టర్ తోటకూర ప్రసాద్ను అభినందించారు. మహా నాయకుల విగ్రహాలకు జీవం పోయడంలో నిష్ణాతుడైన ఆంధ్రప్రదేశ్కు చెందిన బుర్రా వర ప్రసాద్ (భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత) ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ విగ్రహం ఏడు అడుగుల ఎత్తు 30 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఆరు అడుగుల ఎత్తయిన వేదికపై ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అమెరికాలోని మొత్తం 17 విగ్రహాలలో ఇదే అతి పెద్ద విగ్రహం. ఈ పార్క్లో మహాత్ముని విగ్రహ ప్రతిష్ఠాపనకోసం నార్త్ టెక్సస్ మహాత్మా గాంధి మెమోరియల్, ఇండియన్ అమెరికన్ ఫ్రండ్షిప్ కౌన్సిల్, నార్త్ టెక్సస్ ఇండియా అసోసియేషన్ గత నాలుగేళ్లుగా ఎంతో కృషి చేశాయి. మా శ్రమ ఇన్నాళ్లకు ఫలించిందనిఅధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర సంతోషం వ్యక్తం చేశారు.
గాంధీజీ ముని మనుమడు సతీష్ ధుపేలియా ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా హాజరయ్యారు. భారత కాన్సల్ జనరల్ పి. హరీశ్, అమెరికా కాంగ్రెస్ ఉమన్ ఎడ్డీ బెర్నైస్ జాన్సన్, కాంగ్రెస్ ఉమన్ తులసీ గెబార్డ్, అర్వింగ్ నగర మేయర్ బె త్ వాన్ డ్యూన్ ప్రభృతులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.
వీరితో పాటు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెమోరియల్ ప్లాజా కమిటీలో డాక్టర్ తోటకూర ప్రసాద్ ఛైర్మన్గా, కో ఛైర్మన్లుగా తయాబ్ కుంద్వాలా, ఎస్ స్వాతి, కార్యదర్శిగా కె రావు, ట్రెజరర్గా దిలిప్ పటేల్ వ్యవహరిస్తున్నారు.