ఎన్నారై యువతికి బాలల శాంతి బహుమతి(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికాలో నివాసముంటున్న ప్రవాస భారతీయురాలు నేహా గుప్తా(18)కి ఈ ఏడాదికి గాను అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికయ్యారు. భారతదేశంతోపాటు అమెరికాలోని అనాథ పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నేహా గుప్తాకి ఈ వార్డు దక్కింది.
మంగళవారం ది హేగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో నెదర్లాండ్ష్ రాజు విలెం అలెగ్జాండర్, నోబెల్ శాంతి బహుమతి విజేత, మాజీ అర్చిబిషప్ డెస్మండ్ టాటూ ఈ అవార్డును నేహాకు అందజేశారు.
నేహా గుప్తా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొగ్రాం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే భారతదేశంలోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన నేహా, ఆ తర్వాత అనాథ పిల్లల కోసం ‘ఎంపవర్ ఆర్ఫాన్స్' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకు 25వేల మందికిపైగా అనాథ చిన్నారులకు ఈ సంస్థ చేయూతనందించింది. ఈ సంస్థ చిన్నారులకు విద్యనందించడం, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లాంటి వసతులను కల్పిస్తోంది. కాగా, నిరుడు ఈ అవార్డును పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ అందుకున్నారు.