మళ్లీ మనవాళ్లే: ‘స్పెల్ బి’ విజేతలుగా వన్య, గోకుల్(వీడియో)
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక స్పెల్ బీ పోటీలలో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి చరిత్ర సృష్టించారు. తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా స్క్రిప్ స్పెల్ బీ ఫైనల్ పోటీలో వన్య శివశంకర్ (13), గోకుల్ వెంకటాచలం విజేతలుగా నిలిచారు. అమెరికాలోని మేరీలాండ్లో జరిగిన పోటీలో సమ ఉజ్జీలు(టై)గా నిలువడంతో వారిని సంయుక్త విజేతలుగా ప్రకటించారు.
మూడో స్థానంలో ఓక్లహామాలోని భారతీయ కుటుంబానికి చెందిన కోల్ షాఫెర్ రే నిలిచారు. విజేతలు వన్య, గోకుల్లలో ఒక్కొక్కరికి దాదాపు రూ.23లక్షల(37 వేల డాలర్లు) చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ఈ విజయంతో అమెరికాలో నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన పిల్లల ఆధిపత్యం మరోసారి రుజువైంది.
నిరుడు కూడా మనవాళ్లే ఈ ట్రోఫీని దక్కించుకున్నారు. cytopoiesis, bouquetiere, thamakau లాంటి కఠినమైన పదాలకు ఆత్మవిశ్వాసంతో కావ్య కరెక్ట్గా స్పెల్లింగ్ చెప్పగా, వెంకటాచలం poblacion, caudillismo, nixtamal లాంటి క్లిష్టమైన పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పి ఆకట్టుకున్నారు. గత 18 పోటీలలో 14 సార్లు భారత సంతతి బాలలు ఈ ట్రోఫీని సొంతం చేసుకోగా, వరుసగా ఈ టైటిల్ను గెలువడం ఇది ఎనిమిదోసారి.
2009లో విజేతగా నిలిచిన కావ్య శివశంకర్ సోదరి వన్య శివశంకర్ ఛాంపియన్గా నిలువడం విశేషం. ‘చాలా కాలంగా విజేతగా నిలువడానికి కృషి చేస్తున్నాను. ఈ రోజు నా కల నిజమైంది. కిందటి ఏడాది అక్టోబర్లో మరణించిన అమ్మమ్మకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాను అని కావ్య' పేర్కొన్నారు.
కాగా, అమెరికా జాతీయులు ఈ పోటీల్లో వెనుకబడడాన్ని జీర్ణించుకోలేక భారతీయ విద్యార్థులపై శ్వేతజాతీయులు సోషల్ మీడియాలో జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలతో దాడులు చేస్తున్నారు. ఒక్క ఏడాదైనా అమెరికన్ గెలువాలని కోరుకుంటున్నానని ఓ అమెరికన్ ట్వీట్ చేశారు.