మలేసియాలో యువకుడి అనుమానాస్పద మృతి
నల్లగొండ: మలేషియాలో నల్లగొండ జిల్లా దామరచర్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మాచర్ల సైదయ్య (26) 17 నెలల క్రితం మలేషియాకు వె ళ్లాడు. కౌలాలంపూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్ పట్టణం కనేరియా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్గా చేరాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి నలుగురు స్నేహితులతో కలిసి కారులో డిన్నర్కు వెళ్ళి వచ్చాడు.
అనంతరం తన గదిలో నిద్రలోకి జారుకున్న అతడు శనివారం ఉదయం మృతిచెందాడు. ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం తెలిపారు. అయి తే శనివారం గుంటూరు జిల్లాలో ఉన్న అమ్మమ్మతో సైదయ్య ఫోన్లో మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు. సైదయ్య మృతిపై తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతదేహాన్ని ఇక్కడికి తెప్పించేందుకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీకి వెళ్లాడని, శనివారం ఉదయం ఫ్లాట్లో మరణించి పడి ఉన్నాడని చెబుతున్నారు. అయితే, కుటుంబ సభ్యులు ఆస్పత్రివర్గాలను సంప్రదిస్తే భిన్నమైన మాటలను వినిపిస్తున్నారు. సైదయ్య ప్రమాదానికి గురైనట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాడని సైదయ్య తండ్రి వెంకటేశ్వర్లు అంటున్నారు.