షాకింగ్: అడవిలో గాయపడి 3 రోజులు పాకి వచ్చాడు
కౌలాలంపూర్: మలేసియాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల భారతీయ వ్యక్తి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు రోజుల పాటు మలేసియాలోని అడవిలో పాకుతూ సహాయం కోసం సురక్షితమైన చోటికి చేరుకున్నాడు.
ఆ కారు ప్రమాదంలో మరో భారతీయుడు మరణించాడు. ప్రమాదం గత ఆదివారం మధ్య మలేసియాలోని బీదోర్లో జరిగింది. కారును నడుపుతున్న నికోలస్ ఆండ్ర్యూ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు 20 మీటర్ల లోతు గల లోయలోకి జారిపడింది.
ఆ ప్రమాదంలో ఆండ్ర్యూ కుడి చేయి, కాలు విరిగాయి. దీంతో అతను ప్రవాహంతో పాటు పాకుతూ ముందుకు సాగాడు. అతని మిత్రుడు ఆర్ త్యాగరాజన్ (34) అక్కడికక్కడే మరణించాడు. తాను ప్రవాహంలోని నీటిని మాత్రమే తాగానని, మూడు రోజుల పాటు చెట్ల కింద నిద్రపోయానని నికోలస్ చెప్పాడు.
తన సోదరుడు వివాహం కార్డులు పంపిన తర్వాత తాను ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, అయితే తాను నియంత్రణ కోల్పోవడంతో కారు లోయలో పడిపోయిందని అతను వివరించాడు. లోయలోంచి పైకి రావడానికి ప్రయత్నించానని, అయితే గాయాల కారణంగా సాధ్యం కాలేదని అతను చెప్పాడు. దాంతో తాను పాకుకుంటూ రావడమే మంచిదని భావించానని అతను చెప్పిటన్లు న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ రాసింది.