టి ప్రభుత్వం ఇస్తే..: కూతురుకి తండ్రి 'కదిలించే' లేఖ
మహబూబ్ నగర్: అప్పుల బాధ తట్టుకోలేక కూతురుకు లేఖ రాసి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో అమ్మకు వైద్యం చేయించాలని కూతురుకు రాసిన లేఖలో సదరు రైతు పేర్కొన్నారు.
రైతు లేఖ అందర్నీ కదిలిస్తోంది. 'అప్పుల బాధ ఎక్కువైంది, ప్రభుత్వ రుణమాఫీలో రెండు విడతల్లోను మిత్తి, బీమా పోను రూ.13,500 మాత్రమే చేతికి వచ్చింది. మూడు నెలల క్రితం పిడిగుపడి ఎద్దు చనిపోయినా ప్రభుత్వం నుంచి పైసా రాలేదు.
అమ్మ పారిపాత (కూతురు) నేను చనిపోయాక ప్రభుత్వం నుంచి పైసలు వస్తే రూ.2 లక్షలతో అమ్మ ఆరోగ్యం బాగు చేయించు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకో. అందరికీ నా నమస్కారాలు' అంటూ కొత్తమొల్గరకు చెందిన రైతు కృష్ణయ్య సూసైడ్ నోట్ రాశారు.
రైతు కృష్ణయ్య మూడేళ్ల క్రితం మూడు బోరుబావులు తవ్వించారు. ఒ దాంట్లో కొంత మేర నీళ్లు పడ్డాయి. బోరు బావుల తవ్వకం, మోటార్ ఏర్పాటు.. తదితరాలకు రూ.4 లక్షల అప్పులయ్యాయి. బ్యాంకులో మరో రూ.లక్ష వరకు అప్పు ఉంది. ఈసారి వేసిన పంట రాలేదు. దీంతో, మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి కూతురుతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 12 మంది రైతులు మృతి చెందారు. దాదాపు పదిహేను వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.