బాలకృష్ణ: గుడివాడ సేఫ్ సీటు కాదా?
బాలకృష్ణ తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గుడివాడ నుంచి రెండు సార్లు 1983లోనూ 1985లోనూ విజయం సాధించారు. దాంతో గుడివాడపై ఆయన ప్రత్యేకమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయ ప్రవేశం చేయడానికి గుడివాడ భద్రమైన సీటు కాదని సీనియర్ నాయకులు ఆయనకు చెబుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితిలో పెనమలూరు నియోజకవర్గంపై బాలకృష్ణ దృష్టి పడినట్లు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్థసారథి చలసాని పండును కేవలం 177 ఓట్ల తేడాతో ఓడించారు. అయినప్పటికీ పార్టీ నాయకులు బాలకృష్ణ సులభంగా విజయం సాధించే సీటు కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే సీమాంధ్రలో పార్టీ తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రత్తిపాడులో పార్టీ ఓటమి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని జంప్ తెలుగుదేశం కార్యకర్తల నైతికస్థయిర్యాన్ని దెబ్బ తీసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో బాలయ్య పోటీ చేస్తే పార్టీకి నైతిక బలం సమకూరుతుందని అంటున్నారు.