బండ్ల గణేష్: 'గబ్బర్ సింగ్' లెక్క తప్పిందా?
అనుమానం వచ్చిన ఐటి అధికారులు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోమవారం సోదాలు చేపట్టారని అంటున్నారు
దాదాపు 30 గంటల పాటు గణేష్ నివాసంలోనూ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించిన ఐటి శాఖ అధికారులు ఆయనను తమ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. నిరుడు గణేశ్ నిర్మించిన గబ్బర్సింగ్ సినిమా వసూళ్ల వ్యవహారంలో రిటర్న్లకు, ఖాతా పుస్తకాల్లో చూపించిన లెక్కలకు తేడాలున్నట్లు ఐటి శాఖ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. సినిమా విజయోత్సవ ఫంక్షన్లో కలెక్షన్లపై ఆయనే వెల్లడించిన వైనాన్ని టీవీల క్లిప్పిం గులను చూపించి మరీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
తొలి సినిమా 'ఆంజనేయులు' రూ.20 కోట్లతో నిర్మించినా ఏమీ వెనక్కిరాలేదని, రెండో సినిమా 'తీన్మార్' రూ.30 కోట్లతో నిర్మిస్తే అదీ అంతంత మాత్రంగానే డబ్బు వెనక్కి వచ్చిందని, అయినా మూడో సినిమా 'గబ్బర్సింగ్' రూ.40 కోట్లు ఖర్చుపెట్టి ఎలా తీయగలిగారని ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. దానికితోడు, తాజా సినిమా 'బాద్షా' రూ.50 కోట్లతో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్తో ఇద్దరు అమ్మాయిలతో సినిమాను తలపెట్టారు. రామ్ చరణ్ తేజాతో కూడా ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ విషయాలన్నింటిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిడంతో చివరికి కోటి రూపాయల అడ్వాన్స్ టాక్స్ చెల్లించి గణేశ్ బయటపడ్డట్టు తెలిసింది. తెలుగు సినిమా అగ్రదర్శకుల్లో ఒకరికి విదేశాల నుంచి తెప్పించి బహుమతి ఇచ్చిన లక్షలు విలువ చేసే యాష్ట్రే గురించి కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.