రోహిత్ ఇష్యూ:'ఐసీసీయా ఇండియన్ క్రికెట్ కౌన్సిల్'
ఢాకా: పాకిస్ధానీ అంపైర్ అలీమ్ దార్ 'నో బాల్' వివాదం ముగియలేదు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చిన బంతిని అంఫైర్ నోబాల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పెద్ద దుమారం చెలరేగుతోంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇక ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ మాట్లాడుతూ అంఫైరింగ్లో తప్పులు జరగడం సహమేనని అన్నారు.
కానీ అలీమ్ దార్ తీసుకున్న నిర్ణయంపై మాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. దీనిపై ఐసీసీ విచారించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏ దేశమైనా తమకు వ్యతిరేకంగా ఇలా అంపైర్ తప్పిదం వస్తే ఇలాగే స్పందిస్తామన్నారు. నేనీ విషయాన్ని ఐసీసీ అధ్యక్షుడిగా చెప్పడం లేదని, బంగ్లాదేశ్ అభిమానిగా చెబుతున్నానని అన్నారు.
ఐసీసీ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ మాదిరి తయారైందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్కు చెందిన 'ఢాకా ట్రైబునే' వార్తా కథనం ప్రకారం ఐసీసీకి రాజీనామా సమర్పించే యోచనలో ముస్తఫా కమల్ ఉన్నట్లు పేర్కొంది. ముస్తఫా కమల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్లానింగ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు.
ఐసీసీ అధ్యక్షడు నుంచి ఈ కామెంట్లు వరల్డ్ గవర్నింగ్ బాడీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఐసీసీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఐసీసీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ధర్నాలకు ఆ దేశ క్రికెట్ అభిమానులు దిగేందుకు సిద్ధమైనట్లు వార్తా కథనంలో పేర్కొంది.
ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా మార్చి 19(గురువారం)న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుండగా, బంగ్లా బౌలర్ రుబెల్ వేసిన 40వ ఓవర్లో పుల్ టాస్ బంతిని రోహిత్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు.
బంతి ఫీల్డర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు సంబరాలకు సిద్ధమవుతుండగానే.... మైదానంలో ఉన్న అంఫైర్ అలీమ్ దార్ నో బాల్ ఇచ్చాడు. ఐతే బంతి నడుము కంటే తక్కువ ఎత్తులోనే వెళ్తున్నట్లు రీప్లేలో తేలింది.
అప్పటికే రోహిత్ శర్మ 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న 24 బంతుల్లో రోహిత్ శర్మ 46 పరుగులు చేశాడు. కాగా, ఎంపైర్ నిర్ణయం పట్ల స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అతను ఆ సమయంలో కామెంటరీ చేస్తున్నాడు. కచ్చితంగా వికెట్ పోయిందని, బాల్ నడుము కంటే కిందుగానే వెళ్లిందని షెన్ వార్న్ చెప్పాడు. అలీమ్ దార్ విశ్వాసాన్ని కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇది నోబాల్ కాదని ట్వీట్ చేశాడు. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పాడు. రోహిత్ శర్మకు లక్కీ బ్రేక్ వచ్చిందన్నాడు. ఈ నిర్ణయం మరో 20 పరుగులు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.