ఆంధ్రప్రదేశ్కు జైట్లీ ఊరట: ప్రత్యేక హోదాపై అంతే?
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యతో సతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాస్తా ఊరట కలిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఆయన శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రంగాలకు నిధులు కేటాయించారు. ప
ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా జైట్లీ ప్రత్యేక ఆర్థిక సహాయనిధిని ప్రకటించారు. ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. విభజన బిల్లులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
కాగా, గోదావరి నదిపై తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం వంద కోట్ల రూపాయలను కేటాయించారు. ట్రిపుల్ ఐటికి 45 కోట్లు, నిట్కు 40 కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐఎంను ఏర్పాటు చేస్తామని జెట్లీ చెప్పారు. దానికి 40 కోట్ల రూపాయలు కేటాయించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రూ. 5.63 కో్ట్ల చొప్పున ఆయన కేటాయించారు. ఐఐటికి కోటి రూపాయలను, గిరిజన విశ్వవిద్యాలయానికి రెండు కోట్ల రూపాయలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసే సహాయ నిధి ఓ రకంగా ఉంటుందనేది చూస్తే గానీ ఆ రాష్ట్రానికి ఏ మేరకు ఊరట కలుగుతుందనేది తెలుస్తుంది. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ఆర్తిక సహాయ నిధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అయినా, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు కొంత మంది ఇప్పటికీ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాస్తా నిరాశాజనకంగానే ఉందని అన్నారు.