గోవా ఎఫెక్ట్: ఆలస్యంగా హడావుడి.. డిగ్గీపై అరిచిన ఎమ్మెల్యేలు, రేణుక పైర్
గోవాలో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హడావుడి చేస్తోంది.
న్యూఢిల్లీ: గోవాలో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హడావుడి చేస్తోంది.
దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో గవర్నర్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ను కలిసి తమకు ఉన్న బలాన్ని చూపించనున్నారు.
గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 13 స్థానాలు గెలుపొందింది. జీఎఫ్పీ, ఎంజీపీ పార్టీల ఎమ్మెల్యేలు సహా స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్య 21. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ మేజిక్ ఫిగర్ రాలేదు. మరో నాలుగు సీట్లు తక్కువ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి నాలుగు, బీజేపీకి ఎనిమిది సీట్లు తక్కుగా ఉన్నాయి.
ముందే అప్రమత్తమైన బీజేపీ ఇందుకోసం కసరత్తు చేసింది. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టుకుంది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి కావాలని మిత్రపక్షాలు, బీజేపీ ఎమ్మెల్యేలు అడిగితే.. అందుకోసం రక్షణ మంత్రిగా ఉన్న ఆయనతో రాజీనామా కూడా చేయించింది.
ఇంత, జరిగాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తోందని అంటున్నారు. డిగ్గీ నాయకత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం సరిపోదు.
దాని గురించి గవర్నర్కు ఏం చెప్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. బలం ఉంటే మీరు గవర్నర్ను ఎందుకు కలవలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అక్కడా ఆ పార్టీకి షాక్ తగిలింది.
ఎక్కువ సీట్లు వచ్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోకపోవడంపై గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానంపై, డిగ్గీపై ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉదయం డిగ్గీతో జరిగిన భేటీ సందర్భంగా వారు గట్టిగా మాట్లాడారు.
భేటీలో బాగా అరుస్తూ డిగ్గీని నిలదీయగా.. ఆయన వారిని సైలెన్స్గా ఉంచే ప్రయత్నం చేశారు. ఇతరుల మద్దతు కూడగట్టడంలో మీ వైఫల్యం కనిపిస్తోందని వారు డిగ్గీపై మండిపడినట్లుగా తెలుస్తోంది. మీ తీరు ఇలాగే ఉంటే మేం పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమని ముగ్గురు ఎమ్మెల్యేలు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
డిగ్గీని తొలగించండి: రేణుకా చౌదరి
గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడంలో దిగ్విజయ్ విఫలమయ్యారని అందరూ మండిపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి.. డిగ్గీపై మండిపడ్డారు. ఆయనను వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.