చంద్రబాబు ఆశలపై నీళ్లు: రాజధాని జాప్యమే?
హైదరాబాద్: జూన్ 8వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. జూన్ 8వ తేదీనాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని అనుకున్నారు.
అయితే, ఆయన ఆశలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. మాస్టర్ ప్లాన్ రాకుండా శంకుస్థాపన చేయడం సరి కాదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం. మాస్టర్ ప్లాన్ అందిన తర్వాతనే మంచి ముహూర్తం చూసుకుని శంకుస్థాపన చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా, రాజధాని నిర్మాణాన్ని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఎపి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని తూళ్లూరు ప్రాంతంలో జరగకూడదనే ఉద్దేశంతో కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
జూన్ మొదటి వారంలో రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించి మూడేళ్ల లోపు పూర్తి చేస్తే తమ ప్రభుత్వం చిరస్తాయిగా నిలిచిపోతుందని, అలా కాకుడదనే దురుద్దేశంతో అడ్డుకోవడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని వారికి భయం పట్టుకుందని నారాయణ అన్నారు.
ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఇష్టం లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు రామకృష్ణతో పాటు మరి కొంత మంది అనవసరమైన పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మెజారిటీ రైతుల అంగీకారం మేరకే భూసేకరణ చేశామని, అయితే కొంత మంది భూసేకరణ వద్దంటూ కోర్టుకు వెళ్లారని, వారి భూముల్లో ఈ నెల 14వ తేదీ నుంచి భూసేకరణ ప్రక్రియ చేపడుతామని ఆయన చెప్పారు.