ముద్రగడ ఫోన్: పవన్కళ్యాణ్పై చినరాజప్ప తీవ్రవ్యాఖ్య
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన టిడిపి నేత, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ నేతలతో, కాపులను పట్టించుకోని పవన్ కళ్యాణ్తో ముద్రగడ పద్మనాభానికి ఉన్న పనేమిటో చెప్పాలని నిలదీశారు.
హైదరాబాదు కు వచ్చిన ముద్రగడ పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంపై చినరాజప్ప స్పందించారు. ఆయన రోజుకో లేఖను రోజుకో రకంగా ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నా పోరాటాలు ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలను కలవడంలో ఆంతర్యం ఏమిటో ఆయన చెప్పాలన్నారు. రాజకీయంగా ఎదుగుతున్నారన్న కక్షతోనే నారా లోకేష్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్ వచ్చిన ముద్రగడ పద్మనాభం.. కాంగ్రెస్ నేతలను వరుసగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఆయన శనివారం నాడు ఏపీసీసీ రఘువీరా రెడ్డి, చిరంజీవిలను కలిశారు. మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కూడా కలిశారు.
ఆదివారం నాడు జూబ్లీహిల్స్లో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజును కలిశారు. కాపు గర్జనకు మద్దతు ఇచ్చినందుకు పళ్లంరాజుకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి, ముద్రగడతో మాట్లాడించారు. ఉద్యమానికి మద్దతివ్వాలని పవన్ను ముద్రగడ కోరారు. దీనిపై చినరాజప్ప స్పందించారు.
కాగా, ముద్రగడ వెనుక, తుని ఘటన వెనుక వైసిపి అధినేత జగన్ ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నుంచి బయట పడేందుకే ముద్రగడ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను, కాపు నేతలను వరుసగా కలుస్తున్నారని టిడిపి నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను కూడా కలవడం వల్ల, తన వెనుక జగన్ ఉన్నారనే ఆరోపణల నుంచి తనను బయటపడేస్తాయని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.