ముందు వరుసలో బాలయ్య, బ్యాక్ బెంచీలో లోకేశ్
అమరావతి: తిరుపతిలో శుక్రవారం టీడీపీ పసుపు పండుగ మహానాడు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ప్రారంభమైన 'మహానాడు' వేడుకలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మహానాడు కోసం రెండు రోజులు ముందుగానే తన సొంతూరు నారావారి పల్లెకు చేరుకున్న లోకేశ్ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
వేడుక ప్రారంభమయ్యేదాకా మాహానాడు ప్రాంగణంలో కనిపించిన నారా లోకేశ్ మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోగానే వారిని ఆహ్వానించారు. మహానాడు వేదికపై టీడీపీకి చెందిన అతిరథ మహారథులంతా ఆశీనులయ్యారు.
వేదికపై కూర్చునే విషయంలో బాలకృష్ణ, నారా లోకేశ్లు తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వేదికపై ముందు వరుసలో పార్టీ సీనియర్లు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళా వెంకట్రావుల మధ్య బాలకృష్ణ కూర్చోగా చివరి వరుసలో నారా లోకేశ్ కూర్చున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ల వల్ల బాలకృష్ణ కాస్తంత అలసిపోయినట్టు కనిపించారు.
కాగా, చివరి వరుసలో కూర్చొన్న నారా లోకేశ్ పార్టీ యువ నేతలతో కలిసి ఉత్సాహాంగా మాట్లాడుతూ కనిపించారు. ఇక తిరుపతిలోని నెహ్రూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదిక వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహానాడు ప్రాంగణం వద్ద ఎన్టీ రామారావు, చంద్రబాబు ఫ్లెక్సీతో పాటు బాలకృష్ణ, లోకేశ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ను బాహుబలిగా చూపుతూ భారీ కటౌట్ ఆకట్టుకుంటుంది. మహానాడు ప్రాంగణం వద్దకు వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. సుమారు ముప్పై వేలమంది కార్యకర్తల వచ్చారని అంచనా.
ఇదిలా ఉంటే మహానాడు పండుగకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, పాత్రికేయులకు మూడు రోజుల పాటు నోరూరించే పసందైన శాకాహార, మాంసాహార వంటకాలను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపి మాగంటి బాబు దగ్గరుండి సిద్ధం చేయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల సమావేశాల్లో మొత్తం 18 తీర్మానాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని మిత్రపక్షం బీజేపీని విమర్శించడం కాకుండా, రాష్ట్రంలోని తమ అవసరాలను వివరిస్తూ మరింత సాయం చేయాలంటూ తీర్మానం చేసి పంపాలని టీడీపీ పెద్దలు నిశ్చయించారు.