పవన్కు రైతుల ప్రశ్నలు, జనసేన జెండాలతో ధర్నా
తుళ్లూరు: ఎక్కడ అన్యాయం జరిగినా గళమెత్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం తమ వద్ద ఉన్న భూములను లాక్కుంటుంటే ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో "మీరు అండగా ఉన్నామని చెప్పడంతోనే మీరు చెప్పిన పార్టీకి ఓట్లేశాం. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతోంది. అందుకోసమే మీ స్పందన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్ధితి దాపురించింది" అంటూ బేతపూడికి చెందిన 30 మంది రైతులు ఆందోళనకు దిగారు.
బేతపూడి గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30 ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలిందని వారు తెలిపారు. తాజాగా మిగిలిన 200 ఎకరాలను కూడా తీసుకుంటామన్న ప్రభుత్వం ఏడాదికి రూ. 30 వేలు ఇస్తానంటోందని, ఇది ఏ మూలకు సరిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరుపున పవన్ కళ్యాణ్ నిలవాలనే ఉద్దేశ్యంతోనే ఆందోళకు దిగామని వారు చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన తొలి ధర్నా:
నవ్యాంధ్ర కొత్త రాజధాని రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతుంది. చాలా మంది రైతులు ఇప్పటికే తమ భూములను సీఆర్డీఏకి ఇవ్వగా, మరికొంత మంది రైతులు మాత్రం భూములిచ్చేది లేదని గట్టిగా చెబుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం బేతపూడి గ్రామంలో జనసేనకు పార్టీకి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ల్యాండ్ పూలింగ్ను తాము వ్యతిరేకిస్తున్నామని, బలవంతంగా తమ నుంచి భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వీరంతా కూడా జనసేన జెండాలను చేతబట్టి ధర్నాకు దిగడం విశేషం. జనసేన పార్టీ స్ధాపించిన తర్వాత ఆ పార్టీ జెండాలను చేతబట్టి ఏ కార్యక్రమం కూడా జరగలేదు. జనసేన పార్టీ పేరుతో జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమం కావడంతో ఈ ధర్నా వార్తల్లోకెక్కింది.
ఈ ధర్నాలో రైతులు పవన్ కళ్యాణ్తో ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ఈ బ్యానర్లపై "ఏ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానన్న పవన్, తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ పరిస్ధితుల్లో పవనే మాకు దిక్కు" అంటూ రాశారు. పవన్ కళ్యాణే మాకు దేవుడని, ఆయన మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని జనసేన పార్టీకి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.