తండ్రి మృతితో రాజకీయాల్లోకి.. అధినేతలు ఆలోచించేస్థాయికి ఎదిగిన భూమా
ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా కీలక నేతగానే చలామణి అయ్యారు. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లోనూ పోరాటం చేసుకుంటూ రాజకీయాల్లో తన ప్రత్యేకతను .
కర్నూలు: ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా కీలక నేతగానే చలామణి అయ్యారు. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లోనూ పోరాటం చేసుకుంటూ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్న వయసులో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భూమా నాగిరెడ్డి (54) కర్నూలు జిల్లా రాజకీయాల్లోనే గాక, రాష్ట్ర రాజయాల్లోనూ కీలక నేతగా ఎదిగారు.
భూమా కన్నుమూత, రేపు అంత్యక్రియలు: కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం: బాబు-జగన్ షాక్
భూమా అండ ఉంటే చాలు అని పార్టీల అధినేతలు సైతం ఆలోచించే స్థాయికి ఎదిగిన నాగిరెడ్డి ఆకస్మిక మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. తాను చెప్పింది చేయడానికి ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడరన్న పేరు సంపాదించుకున్న భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
చిన్నతనం నుంచే..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె గ్రామంలో 1964 జనవరి 8వ తేదీ భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన నాల్గవ సంతానమే భూమా నాగిరెడ్డి. నాగిరెడ్డి చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా..
కాగా, అప్పటికే కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్న బాలిరెడ్డి తన కుమారుడు నాగిరెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో చెన్నైలోని ఒక ప్రైవేటు కళాశాలలో 11వ తరగతిలో చేర్పించారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించడానికి భూమాను బెంగళూరుకు పంపారు.
తండ్రి హత్యకు గరవడంతో..
అయితే బాలిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురికావడంతో నాగిరెడ్డి చదువు మధ్యలోనే ఆపేసి తిరిగి వచ్చేశారు. భూమా నాగిరెడ్డికి ముగ్గురు సోదరులు. భాస్కర్రెడ్డి, ప్రతాపరెడ్డి, శేఖర్రెడ్డి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శేఖర్రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందినప్పుడు 1984లో భూమా నాగిరెడ్డి రుద్రవరం మండలం నరసాపురం సింగిల్విండో అధ్యక్షుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు.
తొలిసారిగా ఎమ్మెల్యే..
1986లో ఆళ్లగడ్డ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్న భూమా భాస్కర్రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎంపిపిగా ఎన్నికయ్యారు. అనంతరం తన సోదరుడు భూమా శేఖర్రెడ్డి కూడా గుండెపోటుతో మృతిచెందడంతో తొలిసారిగా 1992లో ఆళ్లగడ్డ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భూమాకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
సుదీర్ఘ కాలంలో చంద్రబాబుతో..
అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేశారు. నాగిరెడ్డి 1996, 98, 99 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, ఒకసారి నంద్యా ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపిలో ఎన్టీఆర్ నమ్మిన వ్యక్తిగా గుర్తింపు పొందిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత చంద్రబాబు వద్ద కూడా అదే తరహాలో ప్రాధాన్యత పొందారు.
రాజకీయాల్లో తన ముద్ర
ఆళ్లగడ్డ రాజకీయాల్లో తనదంటూ ముద్రవేసిన భూమా నాగిరెడ్డి నంద్యాల రాజకీయాల్లో కూడా తనసత్తా చాటి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుని నంద్యాల కేంద్రంగా రాజకీయంలో రాటుదేలారు. మొదట్లో టిడిపిలో ఉన్నప్పటికీ మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో పోటీ పడుతూ వర్గపోరుకు తెరలేపి నంద్యాలలో ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి నంద్యాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
ప్రధానిపైనే పోటీ..
మూడుసార్లు ఎంపిగా ఎన్నిక కావడమే కాక 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటికీ మంచిపేరు సాధించుకున్నారు. కాగా, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పదవికి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఆయన సతీమణి నంద్యాల ఎంపీగా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భూమా దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఆ పార్టీలో కీలకంగా మారుతున్న సమయంలోనే కారు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత కొంత కాలానికి కూతురు, ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు.