టైమ్ అడిగిన రజనీకాంత్: అమిత్ షా షాక్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు అమిత్ షా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరే విషయంపై రజినీకాంత్ సాగదీత ధోరణిని అవలంభిస్తుండటంతో అమిత్ షా విసిగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో పార్టీలో చేరాల్సిందింగా రజనీకాంత్ను ఎవరూ కూడా కోరవద్దని రాష్ట్ర నేతలకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. నిర్ణయం తీసుకోవడానికి తనకు మరింత సమయం కావాలని రజనీకాంత్ కోరడంతో అమిత్ షా విసిగెత్తి ఆ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. ఈ రాష్ట్రంలో రజనీకాంత్ వంటి ప్రముఖులను చేర్చుకుని పాగా వేయాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో విశేష ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ తమతో జత కలిస్తే, ఎన్నికల్లో తిరుగుండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నేతలు అంచనా వేశారు. ఇదే అంశంపై మోడీతో పాటు అమిత్ షాలు కూడా రజనీతో సంప్రదింపులు కూడా జరిపారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల 'లింగ' సినిమా షూటింగ్ సమయంలో రజనీని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యక్తిగతంగా కలిశారు. అదేసమయంలో, అమిత్ షా కూడా రజనీతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సైతం రజనీని అతని నివాసంలో కలిసి పార్టీలో చేరికపై మాట్లాడారు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి మీరేనంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో, బీజేపీలో రజనీ చేరిక ఖాయమని అందరూ భావించారు. అయితే, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కాగా, ఇటీవల చెన్నైకి వచ్చిన అమిత్ షా రజనీ అంశంపై కూడా పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. తాను మరోసారి చెన్నై రాకముందే రజనీ తన నిర్ణయాన్ని తెలపాలని కోరారు.
అయితే, నాలుగు నెలలు ఓపిక పట్టండి అంటూ రజనీ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అమిత్ షాకు కోపం వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరడంలో అర్థం లేదని అమిత్ షా అన్నారట. ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీలోకి రజనీకాంత్ రావాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం.