చంద్రబాబుకు ఝలక్, జగన్కు షాక్: పవన్ కల్యాణ్తో బిజెపి?
క్రియాశీలక రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
విజయవాడ: క్రియాశీలక రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి అధిష్టానం క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినట్లేనని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బిజెపి పూర్తిగా దూరం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే, దానికి ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశం బిజెపి అధిష్టానానికి ఉన్నట్లు తెలుస్తోంది.
నొప్పించక తానొవ్వక అనే రీతిలో వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మార్చే ఎత్తుగడకు బిజెపి అధిష్టానం తెర లేపినట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ను దువ్వుతారా...
వెంకయ్య నాయుడిని క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించిన బిజెపి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను దువ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయనతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనను తిరిగి ఎన్డిఎలో భాగస్వామిని చేసే ప్రయత్నాలు ముమ్మరవుతాయని అంటున్నారు.గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ తర్వాత జరిగిన పరిణామాల్లో సంబంధాలు తెంచుకున్నారు.
Recommended Video
వెంకయ్య నాయుడిని టార్గెట్ చేసి....
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ వెంకయ్య నాయుడిని టార్గెట్ చేసుకున్నారు. వెంకయ్య వల్లనే పవన్ బిజెపికి దూరమయ్యారన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది.. తాజాగా వెంకయ్య క్రియాశీల రాజకీయాలకు దూరం కావడం పవన్ను తిరిగి బిజెపి వైపు అడుగులు వేయించి, రాష్ట్రంలో ఎన్డీఏను పటిష్టం చేసేందుకు బిజెపిలోని ఓ వర్గం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా చెబుతున్నారు. త్వరలో పవన్ కల్యాణ్ను కలసి ఎన్డీఏతో తిరిగి పనిచేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ వల్ల..
పవన్ కల్యాణ్ ఎన్డీఏతో తిరిగి జతకడితే రాష్ట్రంలో బిజెపి, జనసేన కూటమి నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఎన్డిఎ వైపు వస్తుందని భావిస్తున్నారు, దానికితోడు బిజెపిలోని కాపు నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కోస్తాలోని కాపు, రాయలసీమలోని బలిజ వర్గాలు మూకుమ్మడిగా పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాకు వస్తున్నారు. అంతేకాకుండా, వివిధ సామాజిక వర్గాల్లో పవన్ కల్యాణ్కు ఉన్న ఇమేజ్, మంచి పేరు ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నారు.
చంద్రబాబుతో ఇక తెగదెంపులే...
చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడమే మిగిలి ఉందని అంటున్నారు. బిజెపితో చంద్రబాబు స్నేహం చెడకుండా వెంకయ్య నాయుడు ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారనే అభిప్రాయం ఉంది. వెంకయ్య నాయుడి మాట కాదనలేక, ఆయనకున్న ప్రాబల్యం దృష్ట్యా చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయం ఉంది. దీంతో వెంకయ్య నాయుడిని నొప్పించకుండా ఎపిలో చంద్రబాబుకు దూరం జరిగి తనదైన శైలిలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సంకేతాలు....
చంద్రబాబుకు దూరం జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. గత ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మోడీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో ఆయనకు ప్రత్యర్థులైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా చంద్రబాబు అంటేనే బుస కొట్టే లక్ష్మీపార్వతికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. దీన్నిబట్టి బిజెపి అధిష్టానం తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ దగ్గరైనట్లే...
తాజా పరిణామాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపికి చాలా దగ్గరైనట్లు కనిపిస్తున్నారు. వైసిపి విజయసాయి రెడ్డి బిజెపిలోని కీలక నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రంలో చోటు చేసుకునే పరిణామాలు చంద్రబాబు కన్నా జగన్కు ముదు తెలుస్తున్నాయి. దీన్నిబట్టి బిజెపితో జగన్కు స్నేహం కుదిరినట్లు భావింంచవచ్చు. వెంకయ్య నాయుడిపై భగ్గుమనే వైసిపి ఆయన అభ్యర్తిత్వానికి మద్దతు ప్రకటించింది. వెంకయ్య నాయుడు ఎపి రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల జగన్కు మేలు జరిగే అవకాశాలున్నాయి. బిజెపితో కుదిరిన స్నేహం వల్లనే కాకుండా తమకు అడ్డు తొలిగిపోతుందనే ఆనందం కూడా జగన్ను అందుకు పురిగొలిపి ఉంటుంది.
జగన్తో ఎలా మరి...
పవన్ కల్యాణ్తో పొత్తు కుదిరితే బిజెపి జగన్ను వదిలేస్తుందా అనే సందేహం ఉదయించడం సహజం. అయితే, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి జగన్ సిద్ధంగా లేరు. ఎన్నికల తర్వాత కలిసి పనిచేయడానికి మాత్రం ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అందువల్ల బిజెపి పవన్ కల్యాణ్ను ఎన్డిఎలోకి తిరిగి తీసుకుని వచ్చి బలమైన శక్తిగా రూపొంది పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితిని బట్టి జగన్కు మద్దతు ఇవ్వడమా, జగన్ మద్దతు తీసుకోవడం అని ఆలోచించుకునే అవకాశం ఉంది.