ద్రవిడ పార్టీలతో పొత్తు లేకపోతే బిజెపికి కష్టమేనా? పార్టీ విస్తరణకు పన్నీర్ పావుగా....
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకుగాను బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకుగాను బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ పార్టీలతో కలిస్తే తప్ప ఆ రాష్ట్రంలో బిజెపికి మనుగడ కష్టంగానే మారిందనే చరిత్ర చెబుతోంది. అయితే ఈ పరిస్థితుల్లో అన్నాడిఎంకె సంక్షోభాన్ని తన పార్టీ విస్తరణకు అనుకూలంగా బిజెపి ఉపయోగించుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో బిజెపి ఒంటరిగా పోటీచేసిన సమయంలో ఆశించిన ఫలితాలు మాత్రం సాధించలేదు.అయితే ఇదే తరుణంలో అన్నాడిఎంకె లేదా డిఎంకె పార్టీలతో పొత్తు పెట్టుకొన్న సమయంలోనే ఆ పార్టీ కొన్నిసీట్లను గెలుచుకొంది.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినా ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఒక్క పార్లమెంట్ సీటును కూడ ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది.
రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ విస్తరణ కోసం బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు అన్నాడీఎంకెలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిస్థితులను ఆ పార్టీ తనకు అనుకూలంగా వినియోగించుకొంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ద్రవిడ పార్టీలతో పొత్తు లేనిదే బిజెపి ఒక్క సీటు దక్కలేదు
తమిళనాడు రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేసిన సమయంలో ఆ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడ దక్కలేదు. ద్రవిడ పార్టీలతో పొత్తుతోనే ఆ పార్టీ కొన్ని సీట్లను గెలుచుకొన్న పరిస్థితులు ఉన్నాయి. 1998లో అన్నాడీఎంకె నేతృత్వంలోని ఫ్రంట్ తో బిజెపితో జతకట్టింది. అన్నాడిఎంకె పొత్తుతో ఐదు పార్లమెంట్ స్థానాలకు పోటీచేసి 6.9 శాతం ఓట్లతో బిజెపి మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది.అటు తర్వాత అన్నాడిఎంకెతో పొత్తును వదులుకొని డిఎంకెతో పొత్తును కుదుర్చుకొని 6 సీట్లకు పోటీచేస్తే నాలుగుసీట్లను గెలుచుకొంది.
అన్నాడీఎంకెతో తెగతెంపులు ఇలా
తొలిసారిగా 1998లో అన్నాడీఎంకె పార్టీతో బిజెపి పొత్తుపెట్టుకొంది. అయితే ఆ సమయంలో బిజెపి ఐదు సీట్లకు పోటీచేసి మూడు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది.ఏడాది తిరిగేసరికి తమిళనాడులో అధికారంలో లని జయ నేతృత్వంలోని అన్నాడిఎంకె కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో కలిసి వాజ్ పేయ్ సర్కార్ ను కూల్చివేసింది.దీంతో బిజెపి అన్నాడీఎంకెతో తెగతెంపులు చేసుకొని డీఎంకెకు దగ్గరైంది. 1999 ఎన్నికల్లో డీఎంకె తో కలిసి బిజెపి 6 పార్లమెంట్ స్థానాలకు పోటీచేసి నాలుగు పార్లమెంట్ స్తానాలను గెలుచుకొంది.అయితే 2004 ఎన్నికలకు ముందు డిఎంకె బిజెపితో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ కు దగ్గరైంది.దీంతో అన్నాడీఎంకెతో కలిసి బిజెపి పోటీచేసింది.అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి ఒక్కసీటు కూడ దక్కలేదు.
ఒంటరిగా పోటీచేస్తే ఒక్క సీటు దక్కలేదు
తమిళనాడు రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేసింది. అయితే ఆ పార్టీ కేవలం 2.3 శాతం ఓట్లతో ఒక్కసీటును కూద దక్కించుకోలేదు. ఆ తర్వాత 2012 చివరి నుండి తమ పార్టీతో పొత్తు కోసం అన్నాడీఎంకె తో పొత్తు కోసం నరేంద్ర మోడీ ప్రయత్నించినా జయలలిత అంగీకరించలేదు.2014 ఎన్నికల్లో చిన్నచితకా పార్టీలతో కలిపి బిజెపి 7 సీట్లకు పోటీచేస్తే నాగర్ కోయిల్ మినహ ఏ స్థానంలో కూడ బిజెపి గెలువలేదు. ఈ స్థానం నుండి విజయం సాధించిన రాధాకృష్ణన్ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకొన్నారు.1996లో బీజెపి 17 సీట్లకు పోటీచేస్తే నాగర్ కోయిల్ లో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో ఆశించిన ఫలితం దక్కలేదు.
ద్రవిడ పార్టీలే బిజెపి ఎదుగుదలకు అడ్డంకి?
హిందూ సమాజంలో బ్రహ్మధిపత్యాన్ని మూఢ విశ్వాసాలను ఖండించి వ్యవసాయ, వృత్తి కులాల మద్దతుతో ముందుకు సాగిన ద్రవిడ ఉద్యమం విజయం సాధించింది. ఈ కారణంగానే 20వ, శతాబ్దం చివరినాటికి బీజెపి తమిళనాడులో కాలుమోపే వాతావరణం అత్యల్ప స్థాయిలో ఉంది. అయితే ద్రవిడ పార్టీలతో పొత్తు కారణంగానే బిజెపి కొన్ని సీట్లను గెలుచుకొంది.
కర్ణాటక తరహాలోనే తమిళనాడులో విస్తరణకు బిజెపి ప్లాన్
1996 -2004 మధ్య కాలంలో రామకృష్ణ హెగ్డేతో పొత్తు పెట్టుకొన్న బిజెపి ఆ రాష్ట్రంలో తన పార్టీని విస్తరించుకొంది. అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో విస్తరించింది.అయితే జయలలిత కూడ బిజెపి విస్తరణను అడ్డుకొంది.అయితే శశికళ కూడ బిజెపి విస్తరణను అడ్డుకొనే అవకాశం ఉందని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో పన్నీర్ సెల్వం బిజెపి పట్ల కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.అయితే ఈ తరుణంలో అన్నాడీఎంకె లో నెలకొన్న సంక్షొభాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొంటుంది బిజెపి.