ఏపీ నేతలకు అమిత్ షా షాక్: చంద్రబాబుకు ఊరట
టిడిపితో పొత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలపడడం లేదని ఆ పార్టీ సీనియర్లు అమిత్ షాకు ఫిర్యాదుచేశారు.చాలామంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని,
అమరావతి: టిడిపితో పొత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలపడడం లేదని ఆ పార్టీ సీనియర్లు అమిత్ షాకు ఫిర్యాదుచేశారు.చాలామంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, అయితే టిడిపితో పొత్తు కారణంగానే వారు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదని వారు అమిత్ షాకు చెప్పారు.అయితే పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న నాయకుల జాబితాను తనకు ఇవ్వాలని అమిత్ షా పార్టీ నాయకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తల సమావేశానికి గురువారం నాడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తును మెజారిటీ నాయకులు వ్యతిరేకించారు.టిడిపితో పొత్తు వల్ల బిజెపి నష్టపోతోందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. టిడిపి నాయకులు బిజెపిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆరోపించారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో అమిత్ షా చర్చించారు. అంతేకాదు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయపరిస్థితులపై షా చర్చించారు.బూత్ స్థాయి లెవల్లో పార్టీని బలోపేతం చేయడంపై షా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు.
బిజెపిలో చేరాల్సిన నేతలు టిడిపిలో చేరారు
టిడిపితో పొత్తు బిజెపి కొంపముంచుతోందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకులు వ్యక్తం చేశారు.ఈ విషయమై పొత్తు లేకపోతేనే బిజెపి బలపడే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు వివరించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇంట్లో విందుకు వెళ్ళడానికి ముందే బిజెపి నాయకులు షా కు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఏకరువుపెట్టారు.టిడిపితో పొత్తు కారణంగా బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న నాయకులు వెనుకంజ వేస్తున్నారని ఆయన చెప్పారు.అయితే పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపే నాయకుల జాబితాను తనకు ఇవ్వాలని అమిత్ షా పార్టీ నాయకులకు సూచించారు.అయితే ఈ జాబితాను తాము గతంలో రాష్ట్రకమిటీకి ఇస్తే , కొద్దిరోజుల తర్వాత వారంతా టిడిపిలో చేరారని బిజెపి నాయకులు అమిత్ షా దృష్టికి తెచ్చారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం
పార్టీ నాయకుల చెప్పిన మాటలను విన్న అమిత్ షా అన్ని మార్గాలనుండి రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెప్పించుకొంటున్నట్టు చెప్పారు . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటామని ఆయన పార్టీ నాయకులకు హమీ ఇచ్చారు. అదే సందర్భంలో పొత్తు విషయమై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం నాయకులు చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు హితవు పలికారు.
కేంద్ర పథకాలకు ప్రచారం లేదు
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న పథకాలకు రాష్ట్రంలో ప్రచారం లేకుండా పోయిందని పలువురు పార్టీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.ఈ పథకాలపై కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడం లేదన్నారు. వాటిపై మోడీ ఫోటోలు లేకుండా చేశారని షా కు ఫిర్యాదు చేశారు.గ్రామస్థాయిలో వేసిన జన్మభూమి కమిటీల్లో పార్టీ సభ్యులకు స్థానం లేకుండా చేశారని చెప్పారు. టిడిపి సూచించిన వారికే పనులు చేస్తున్నారని ఫిర్యాదుచేశారు. రాష్ట్రంలో నేతలు చెప్పిన ఏ పనిని చేయవద్దని అధికారులను ఆదేశిస్తున్నారని చెప్పారు.
టిడిపి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది
పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టుతో పాటు, వివిధ పథకాల్లో దారుణమైన అవినీతి జరుగుతోందని పార్టీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ కూడ టిడిపి నాయకులకే ఇస్తున్నారని చెప్పారు. మరో వైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని బిజెపితో పొత్తు విషయమై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళారు బిజెపి నాయకులు. టిడిపితో పొత్తు వల్ల పార్టీకి నష్టమేనని వారు చెప్పారు.