బిజెపి వ్యూహం: చంద్రబాబును కార్నర్ చేయడమే...?
విజయవాడ: ప్రత్యేక హోదా ఇవ్వకుండానే రాష్ట్రానికి చాలా చేశామంటూ చెబుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేసే వ్యూహంతో బిజెపి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. హోదా కన్నా ఎక్కువే సాయం చేస్తామంటూ చెబుతూ ఆ విషయం మరిచిపోవాలనే పద్ధతిలో బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్రం చేస్తున్న సాయంపై కూడా చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శలకు దిగుతున్నారు.
ప్రత్యేక హోదా అంటే రూ.700 కోట్లు మాత్రమేనని బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఎపి రాజధాని అమరావతిని నిర్మించే బాధ్యత బీజేపీదేనని ఆయన చెప్పారు.
అలా చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్న సమయంలో కేంద్రం ఇంకుడు గుంతల కోసం రూ.900 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్లో ఇంకుడు గుంతల కోసం రూ. 7 కోట్ల నిధులున్నా పనులు సరిగ్గా జరగడం లేదని ఆయన ఆరోపించారు.
మోడీ పాలన రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన సంబరాల్లో బిజెపి పార్లమెంటు సభ్యుడదు హరిబాబు మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకు ఎక్కువ సాయం చేస్తామని చెప్పారు. కేంద్రం త్వరలో రైల్వేజోన్ను ప్రకటిస్తుందని అన్నారు. రాజధాని ప్లాన్ లేనప్పుడే కేంద్రం రూ. 2 వేల కోట్లు ఇచ్చిందని, ప్రతిపాదనలు పంపిస్తే దశలవారీగా నిధులు కేటాయిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదని, అంతకంటే ఎక్కువగా నిధులు ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సూచించిందని పురందేశ్వరి ఇటీవల అన్నారు. మొత్తం మీద, హోదా అక్కర్లేదని చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఎత్తుగడతో బిజెపి ముందడుగు వేస్తోంది.