కులం కాటేసిన 'వెలి ప్రేమలు': పరువు హత్యల్లో విస్తుపోయే నిజాలు.. ఇదీ పరిస్థితి!
ఊహించని రీతిలో 2014-2015మధ్య 796శాతం ఈ పరువు హత్యలు పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. 2014లో 28పరువు హత్యలు నమోదైనట్లు రికార్డులు చెబుతుండగా.. 2015లొ ఈ సంఖ్య 251కి పెరగడం గమనార్హం.
హైదరాబాద్: "కూటికి లేకపోయినా ఫరవాలేదు కానీ కులానికి చెడుతామా?".. ఇప్పటికీ ఇలాంటి పాత ముతక సామెతలాంటి మనస్తాత్వాలే ఇంచుమించు చాలమందివి. తినడానికి తిండి లేకపోయినా రాజీ పడుతారు కానీ కులం దగ్గరికొచ్చే సరికి మాత్రం 'మా కులమే గొప్పది' అన్నట్లు ఎదుటోడి మీద జులుం ప్రదర్శిస్తుంటారు.
అంతేనా! తేడాలొస్తే.. చంపడానికైనా, చావడానికైనా వెనుకాడరు. అంతటి కులోన్మాదాన్ని నరనరాన నింపుకున్న నరహంతకులు ఇప్పుడు చాలామందే తయారయ్యారు. దేశంలో ఎక్కడో చోట ప్రతీరోజూ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తులను ప్రేమిస్తే.. కన్నబిడ్డలను సైతం హత్య చేయడానికైనా వెనుకాడని అమానవీయ పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి:
కులాంతర వివాహాలు చేసుకోవడం ఒక మహాపాపంగా తయారైంది. అంతర్వివాహాలను కాదని, బయటి కులానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే.. వారు శవాలై తేలుతున్న ఘటనలు అనేకం మన కళ్ల ముందు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గడిచిన రెండున్నర సంవత్సరాల్లో 17పరువు హత్యలు చోటు చేసుకున్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందులోను ఇవి అధికారిక లెక్కలు మాత్రమే!.. మీడియా ఫోకస్ నుంచి తప్పించుకున్నవి, బడాబాబులైతే డబ్బులిచ్చి మేనేజ్ చేసిన అనధికారిక ఘటనలు మరిన్ని ఉండవచ్చు. ఈ హత్యలన్నింటిలోను 'కులం' అన్న అంశమే పరిస్థితిని ఇంతదాకా తీసుకొచ్చింది.
ఒక మధుకర్, ఒక రాజేశ్, ఒక నరేశ్..:
వీరంతా.. ఇటీవలి కాలంలో కులాంతర వివాహాలు చేసుకుని బలైపోయిన యువకులు. తక్కువ కులానికి చెందినవారు తమ ఇంటి బిడ్డలను ప్రేమిస్తారా? అన్న ఆగ్రహంతో అత్యంత దారుణంగా ఈ యువకులను హత్య చేశారు. మధుకర్ దళిత సామాజికవర్గానికి చెందిన యువకుడు కాగా, మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన యువతిని ప్రేమించడం అతని హత్యకు దారితీసింది.
అత్యంత పాశవికంగా మధుకర్ కనుగుడ్లు పీకి, మర్మాంగాలు కోసి చంపేశారన్న ఆరోపణలున్నాయి. ఈమధ్య కాలంలో రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటనల్లో మంథని మధుకర్ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాజేశ్ కూడా అలా బలైపోయినవాడే!:
జమ్మికుంటకు చెందిన రాజేశ్ ది కూడా మంథని మధుకర్ తరహా ఘటనే. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇనుగాల రాజేశ్ అదేకళాశాలలో చదువుతున్న ఒక బీసీ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇంతలో ప్రేమ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు దళితుడితో ఇలాంటి వ్యవహారం నడపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కులానికి చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లి జరపాలని నిశ్చయించారు. అయితే పెళ్లికి రాజేశ్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె కుటుంబ సభ్యులు.. రాజేశ్ ను మార్చి 13న జమ్మికుంట గోదాంల సమీపంలో అత్యంత దారుణంగా హత్య చేశారు.రాజేశ్ నడుముకు బరువు గల రాయిని కట్టి విపరీతంగా కొట్టి బావిలో పడేశారు. దీంతో రాజేశ్ ప్రేమ కథ విషాదాంతంగా మిగిలిపోయింది.
నరేశ్ వెలిప్రేమ:
రజక సామాజిక వర్గానికి చెందిన నరేశ్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్వాతిని ప్రేమించడం ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న వీరిద్దరిని.. పథకం ప్రకారం ముంబై నుంచి భువనగిరికి రప్పించి నరేశ్ ను హతమార్చాడు.
ఆపై స్వాతి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మరోవైపు అదృశ్యమైపోయిన నరేశ్ ఆచూకీ ఎంతకూ వీడకపోవడంతో.. కన్న తల్లిదండ్రులే దాచిపెట్టారన్న ఆరోపణలు కూడా చేశారు. చివరికి శ్రీనివాసరెడ్డి తానే నరేశ్ ను హత్య చేశానని ఒప్పుకోవడంతో.. మరో ప్రేమ జంట కులాంతర వివాహానికి బలైపోయిందని నిర్ధారణ అయింది. పరువు హత్యలు జరిగిన ప్రతీసారి పోలీసులు ఐపీసీ సెక్షన్-302కింద హత్య నమోదు చేస్తుండటంపై కూడా అభ్యంతరాలున్నాయి.
796శాతం పెరిగిపోయాయి:
జాతీయ నేర విభాగ గణాంకాల ప్రకారం.. దేశంలో పరువు హత్యలు భారీగా పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో 2014-2015మధ్య 796శాతం ఈ పరువు హత్యలు పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. 2014లో 28పరువు హత్యలు నమోదైనట్లు రికార్డులు చెబుతుండగా.. 2015లొ ఈ సంఖ్య 251కి పెరగడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్,గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే ఎక్కువ పరువు హత్యలు జరుగుతున్న జాబితాలో ఉన్నాయి. ఇక వీటి తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4,5 స్థానాల్లో నిలవడం.. ఇక్కడ కూడా పరువు హత్యల తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రత్యేక చట్టాలు తేవాల్సిందే:
దేశంలో ఇంతలా పరువు హత్యలు జరుగుతుంటే.. వీటిని నివారించడం కోసం ప్రత్యేకంగా ఓ చట్టం తేవాల్సిందేనన్న డిమాండ్ బలంగా తెరపైకి వస్తోంది. దళిత ఇతర కింద స్థాయి కులాలకు చెందిన వ్యక్తులే ఈ ఘటనల్లో బలైపోతుండటంతో వారిని రక్షించే విధంగా చట్టాలు ఉండాలంుటన్నారు.
పోలీసులెప్పుడూ అగ్ర కులాల వైపే:
పరువు హత్యలన్నింటిలోను పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వారి పక్షపాత వైఖరిని స్పష్టం చేస్తోంది. బాధిత కుటుంబాలు ఎంత మొత్తుకున్నా.. వారి వాదనను వినని పోలీసులు.. నిందితులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మంథని మధుకర్, రాజేశ్, నరేశ్ హత్యల్లో ఈ విషయం తేట తెల్లమైందంటున్నారు.
మంథని మధుకర్ హత్య కేసులో అక్కడి సీఐ బాధిత కుటుంబం పైనే జులుం ప్రదర్శించాడన్న ఆరోపణలున్నాయి. నిందితులకు సహకరిస్తూ.. మధుకర్ హత్యను ఆత్మహత్య అని క్లోజ్ చేసేశాడు. ఆపై దళిత సంఘాలన్ని ఏకమై మంథనిలో మెరుపు ధర్నాకు దిగితే తప్పా.. పోలీసుల్లో కదలిక రాలేదు. మధుకర్ హత్యలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పాత్రపై కూడా ఆరోపణలు ఉండటంతో.. ఈ కేసు మరింత సంచలనం రేకెత్తించింది.
ప్రస్తుతం మధుకర్ రీపోస్టుమార్టం రిపోర్టు హైకోర్టు వద్ద ఉండగా.. జూన్ తొలి వారంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజేశ్ హత్య కేసులోను పోలీసులు నిందితుల పక్షానే నిలబడ్డారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాజేశ్ హత్యను కూడా పోలీసులు ఆత్మహత్య అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఇక నరేశ్ హత్య కేసులోను స్థానిక ఆత్మకూరు ఎస్ఐ శివనాగ ప్రసాద్.. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డికి సహకరించినట్లుగా తెలుస్తోంది. ముంబైలో ఉన్న స్వాతి-నరేశ్ లకు ఫోన్ చేసి.. వారిని భయపెట్టే రీతిలో ఎస్ఐ వ్యాఖ్యలు చేసేశాడు. మీరొచ్చి కనపడకపోతే వీరి పని అయితదంటూ ఎస్ఐ చేసిన వ్యాఖ్యలను స్వాతి-నరేశ్ లను భయపెట్టాయి. ఆ మాటలు నమ్మి భువనగిరికి వస్తే.. నరేశ్ దారుణ హత్యకు గురవగా.. స్వాతి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్వాతిని కూడా ఆమె తండ్రి శ్రీనివారెడ్డే చంపి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
పరువు హత్యలు కాదు మొరటు హత్యలు:
2006లొ లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీగా మారిన పరువు హత్యల కేసుకు సంబంధించి అప్పట్లో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలాంటి హత్యలను పరువు హత్యలుగా పేర్కొనడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఇందులో ఎలాంటి పరువు లేకపోగా.. అత్యంత అమానవీయ రీతిలో మొరటుగా వారిని హత్య చేసినట్లు పేర్కొంది. నిందితుల పాశవిక, ఫ్యూడల్ మైండ్ కు ఈ హత్యలు అద్దం పడుతున్నాయని సుప్రీం చెప్పుకొచ్చింది.
ఊహించిందే జరిగింది: నరేశ్ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ(ఫోటోలు)
ఛలో మంథని: కులోన్మాదానికి బలైన 'మధుకర్' పాశవిక హత్యను నిరసిస్తూ..