నిధులపై కేంద్రం కొలికి, బాబుకి షాక్: చెప్పకుంటే ఏలా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనేది అధికారికంగా చెప్పకుండా నిధులెలా కేటాయిస్తామని రాష్ట్రాన్ని కేంద్రం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించేందుకు బ్యాంకు ఖాతా ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించిందని సమాచారం.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 2015-16లో బడ్జెట్లో పోలవరం, రాజధాని నిర్మాణం, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవటంపై టీడీపీ కేంద్రం పైన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు టీడీపీ ఎంపీలతో చర్చిస్తున్నారని సమాచారం.
పోలవరానికి రూ.వెయ్యి కోట్లు, రాజధానికి రూ.వెయ్యికోట్ల కేటాయించేందుకు వెంకయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటితోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. కొత్త రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైనే ప్రతిపాదన కేంద్రానికి ఇంతవరకు అందకపోవటం వల్లే నిధులు కేటాయింపు జరగలేదని కేంద్రం చెబుతోందని అంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై అధికారిక నివేదిక ఇవ్వగానే నిధులు కేటాయింపు ప్రారంభం అవుతుందని కేంద్రం చెబుతోంది. కొత్త రాజధాని స్థలం, ఇతర అంశాలను అధికారికంగా తెలియజేస్తే రింగురోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులకు వెయ్యి కోట్లు పట్టణాభివృద్ధి శాఖకు చెందిన వివిధ పథకాల నుంచి ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం పైన టీడీపీ నిలదీతకు కేంద్రం ఘాటుగానే స్పందించినట్లుగా చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు పనుల కోసం గత ఏడాది కేటాయించిన రూ.250 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. రూపాయి కూడా ఖర్చు చేయకుండా అదనపు నిధులు కోరడంలో అర్థం లేదనేది కేంద్రం వాదనగా తెలుస్తోంది. పనులు ప్రారంభమయ్యాక నిధులు విడుదల చేసేందుకు సిద్ధమని తెలుస్తోంది.