మోడీ 'మైనార్టీ స్కీం': ఔరంగ జేబు సోదరుడి పేరు
న్యూఢిల్లీ: మైనార్టీలను తమ వైపుకు తిప్పుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేశారని, అందుకే అక్కడి మైనార్టీలు బీజేపీ వైపు ఉంటారని చెబుతుంటారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ దేశవ్యాప్తంగా మైనార్టీలను బీజేపీ వైపుకు తిప్పేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు.
మైనార్టీలకు చెందే పథకాలకు అల్పసంఖ్యాక వర్గాల ప్రముఖుల పేర్లను పెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పథకాలకు ముస్లీం, క్రైస్తవ వర్గాలకు చెందిన ప్రముఖుల పేర్లను పెట్టాలని భావిస్తోంది. మంత్రిత్వ శాఖ తుది జాబితాలో మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, ఔరంగజేబు సోదరుడు దారాషికో పేరు కూడా ఉంది. దారాషికో తన సోదరుడు ఔరంగజేబు చేతిలో హతమయ్యాడు.
భారత జాతీయవాదంపై విశ్వాసం ఉంచి, అందుకోసం పోరాడిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రముఖులకు గుర్తింపును కల్పించడమే తమ ఉద్దేశ్యమని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా చెప్పారు. 2015 జూన్ నాటికి తమ మంత్రిత్వ శాఖ పథకాలకు ప్రముఖుల పేర్లు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిటే పథకాలు ఉన్నాయన్నారు.
పేర్లు పెట్టడం వల్ల మైనార్టీ వర్గం నేతలు జాతీయవాద అంశాలపై పోరాడిన తీరు ప్రజలకు తెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం లౌకిక ముద్ర కోసం ఇలా చేస్తుండవచ్చునని అంటున్నారు. ప్రస్తుతాని కేంద్రం.. సోదరుడు ఔరంగజేబు చేతిలో మరణించిన దారా షిఖో పేరును ఖరారు చేసిందని తెలుస్తోంది.త