అశోక్ ప్రాభవాన్ని బాబు తగ్గిస్తున్నారా?: పతివాడకు చెక్, గంటా ఎందుకు?
విజయనగరం: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన మాటంటే పార్టీకి వేదంలా వినిపించేదని, కానీ, ఇటీవలి కాలంలో ఆయన మాటను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇందుకు అశోక్ గజపతి రాజు ప్రాతినిథ్యం విహిస్తున్న విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక విషయమే నిదర్శనమని అంటున్నారు.
చదవండి: అశోక్ గజపతి రాజు అనుచరుడికి గంటా చెక్
అశోక్ ప్రభావం తగ్గిందా?
అశోక్ గజపతి రాజు తన అనుచరుడు ద్వారపు జగదీష్ను ఈ పదవి కోసం ప్రతిపాదించిననట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో మహంతి చిన్నమ నాయుడి పేరు ఖరారు కావడంతో అశోక్ అనుచరులు ఆశ్చర్యానికి గురిచేశారు. దీంతో అధిష్టానం వద్ద అశోక్ ప్రాభవం తగ్గిందని, జిల్లా తెలుగుదేశం పార్టీ పెనుమార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు.
మరో అధికార కేంద్రం
కాగా, కొన్నేళ్లుగా పార్టీ పదవులకు సంబంధించి అశోక్ గజపతి రాజు మాటకు అధిష్టానం ఎదురుచెప్పలేదు. అలా అని ఆయన అన్ని విషయాల్లోనూ కలగజేసుకోలేదన్నది కూడా కాదనలేని వాస్తవం. అధికారంలో ఉన్నా లేకున్నా అశోక్కు మాత్రం ఇప్పటి వరకు సముచిత స్థానం ఇస్తూ వచ్చిన టీడీపీ అధిష్టానం.. ఇప్పుడు జిల్లాలో రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నదనే వాదనలు వినబడుతున్నాయి.
గంటా రాకతో..
పొరుగు జిల్లా విశాఖపట్నం మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడైతే ఇంఛార్జీ మంత్రిగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టారో అప్పటి నుంచీ ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కూడా అశోక్ మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పతివాడకు చెక్
విజయనగరం జిల్లాలోని 9నియోజకవర్గాల్లో చాలా వరకూ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. ఇందులో నెల్లిమర్ల మరీ వివాదాస్పదంగా ఉంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పతివాడ నారాయణ స్వామినాయుడును వృద్ధాప్యం కారణంగా తప్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
గంటా లేదా మహంతి
అంతేగాక, ఆయన కుమారులకు కూడా టికెట్ ఇచ్చే ఉద్దేశం కూడా టీడీపీ అధిష్టానానికి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా భూకుంభకోణంపై వస్తున్న ఆరోపణలతో పార్టీకి భవిష్యత్ లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈక్రమంలోనే నెల్లిమర్ల నుంచి గంటాను పోటీకి దింపేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, గంటా ప్రాతినిథ్యానికి నెల్లిమర్లలో వ్యతిరేకత వస్తే మహంతి చిన్నంనాయుడినే కొనసాగించవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.