చంద్రబాబు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ ఏప్రిల్ 2, లోకేష్ , అఖిలప్రియకు చోటు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునర్వవ్యవస్థీకరించనున్నారు.ఏప్రిల్ రెండో తేదిన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి సన్నద్దమౌతున్నారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని చంద్రబాబునాయుడు పునర్వవ్యస్థీకరించాలని భావిస్తున్నారు. తన మంత్రివర్గంలో కొందరు మంత్రులను తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఎమ్మెల్సీగా లోకేష్ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.అయితే ఆయనను కూడ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు.
ప్రస్తుతమున్న మంత్రుల్లో పనితీరు సరిగా లేని ఐదుగురు మంత్రులపై వేటు పడే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.అయితే మంత్రివర్గంలో తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ ఆశావాహులు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
ఏప్రిల్ 2న, మంత్రివర్గ విస్తరణ ముహుర్తం?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏప్రిల్ రెండవ తేదిన పునర్వవ్యవస్థీకరించేందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్నాహలు చేస్తున్నారని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.ఏప్రిల్ రెండవ తేది కాకపోతే, ఏప్రిల్ 6వ, తేదిన లేదా 9వ, తేదిన ఏదో ఒక్క రోజున మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించే అవకాశాలున్నాయని సమాచారం.
ఆశావాహులెక్కువే
మంత్రివర్గంలో స్థానం కోసం ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అయితే మంత్రివర్గంలో చోటు మాత్రం కొందరికి మాత్రమే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.మంత్రిపదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఆశావాహులు విస్తరణ ఎప్పుడు ఉంటుందా అంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు.జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల వారీగా బాబు మంత్రివర్గంలో బెర్తులను నింపనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
బాబు మంత్రివర్గంలో ఆరు ఖాళీలు
చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఆరు ఖాళీలున్నాయి. అయితే ఆ ఆరు స్థానాలను ఆయన భర్తీ చేయకపోవచ్చు. ఒకటి లేదా రెండు స్థానాలను ఆయన ఖాళీగానే ఉంచే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది. నలుగురికి పదవులు కట్టబెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది.అయితే బాబు మంత్రివర్గంలోకి ఎనిమిది నుండి పది మంది కొత్త ముఖాలు వచ్చే అవకాశాలున్నాయి.
టీమ్ ను బలోపేతం చేసుకొనేందుకు
తన మంత్రివర్గ సభ్యుల్లో పనితీరు సక్రమంగా లేనివారిని తప్పించుకొనేందుకుగాను చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో సక్రమంగా పనితీరును కనబర్చని వారిని తొలగించాలని బాబు భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబతుున్నాయి.పనిచేసే గుర్తింపు తెచ్చుకోలేకపోయిందన్న విమర్శలు పార్టీలో ఉన్నాయి.అయితే రాజకీయంగా అనుభవం ఉన్నవారికి పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ప్రయోజనం కల్గించేలా ఉండేలా ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
లోకేష్, భూమా అఖిలప్రియకు మంత్రిపదవులు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు మంత్రివర్గంలో బెర్త్ తప్పనిసరి కానుంది.ముస్లిం మైనార్టీల నుండి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీ షరీఫ్, లేదా ఎమ్మెల్యే జలీల్ కాన్, చాంద్ బాషా ల పేర్లు విన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కన్పిస్తోంది.
ఎవరు పదవులు కోల్పోతారో?
దక్షిణ కోస్తాలో తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్న మంత్రిని మంత్రివర్గం నుండి తప్పించే అవకాశం ఉంది. అదే విధంగా ఓ మహిళా మంత్రి విషయంలో కూడ చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రాజకీయంగా పార్టీకి నష్టం కల్గించే రీతిలో వ్యవహరించే పరిస్థితులున్నందున వారిని మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదు.ఓ సీనియర్ మంత్రి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనను కూడ మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి.