షాకింగ్ న్యూస్: సహారా డైరీలో చంద్రబాబు పేరు!
దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బిర్లా సహారా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లించారు.
న్యూఢిల్లీ/అమరావతి: దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బిర్లా సహారా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లించారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు రూంలో ప్రశాంత్ భూషణ్.. సహారా డైరీలలో పేర్లు ఉన్న రాజకీయ నాయకుల వివరాలను వెల్లడించినట్లు 'సాక్షి'లో కథనం ప్రచురితమైంది.
ఆ కథనం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ పేరు 'గుజ్ సీఎం', మోడీజీ అంటూ ఈ డైరీలలో పేర్కొని ఉందని పదే పదే భూషణ్ కోర్టులో నొక్కి చెప్పారు. ఈ కేసులో జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, జస్టిస్ అమితావ రాయ్తో కూడిన ధర్మాసనం ముందు ఆయన వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా కోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖురేషి ఇరకాటంలో పడ్డారు. సహారా డైరీలలో చేతిరాతతో రాసిన ముడుపులు అందుకున్న వారి జాబితాలో ఆయన పేరు నాలుగుసార్లు ఉందని భూషణ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన కొంత అసహనంగా కనిపంచారు.
2014లో సహారా గ్రూప్పై జరిపిన ఐటీ శాఖ దాడులలో దొరికిన డైరీలలో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పిన విషయాలు ఉన్నట్లు వెలుగుచూడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ డైరీలో ఉన్న నాయకుల పేర్లను భూషణ్ కోర్టులో చదువుతూ.. 'సుష్మా స్వరాజ్ జీ, చంద్రబాబు జీ, ములాయం సింగ్ జీ, మాయావతి జీ, ప్రమోద్ జీ కూతురు, శివ్ రాజ్ జీ, రాజస్థాన్, బీహార్ ముఖ్యమంత్రులు, లాలూ జీ, అద్వానీ జీ, రవిశంకర్ జీ, షిండేజీ, ఫరూక్ అబ్దుల్లాజీ, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, దిగ్విజయ్ సింగ్' తదితరుల పేర్లు ఉన్నట్లు తెలిపారు.
'దాదా' అనే పేరు ఈ డైరీలలో నాలుగుసార్లు రాసి ఉంది. కానీ, ఆయన ఎవరు అని ఊహించడానికి కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. ఈ కేసుకు 1990నాటి జైన్-హవాలా కేసుకు ఎన్నో రకాలుగా సారూప్యముంది. జైన్-హవాలా కేసులో రాజకీయ నాయకుల పేర్ల ఇనీషియల్స్ ఉండగా, సహారా డైరీలలో పేర్లు ఉన్నాయి. అప్పట్లో జైన్-హవాలా కేసులో సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపింది.
అయితే, తాజాగా, బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు ముడుపులు స్వీకరించారంటూ దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్ దారు సమర్పించిన సాక్ష్యాధారాల(డైరీల)కు విచారణార్హత లేదంటూ తోసిపుచ్చింది.
'మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్ ప్రింటవుట్లు, సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదుకు, విచారణకు ఆదేశించలేం. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది' అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్లతో కూడిన ధర్మాసనం బుధవారం తేల్చి చెప్పింది.
సహారా గ్రూప్నకు సంబంధించిన పిటిషన్ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో న్యాయప్రక్రియ దుర్వినియోగమయ్యే వీలుందని కోర్టు వ్యాఖ్యానించింది.