బెజవాడ చిచ్చు:కేశినేని 'నక్కజిత్తుపై' బాబు సీరియస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెజవాడ రగడ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని భారీ నీటి పారిశ్రమల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కేశినేని వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా నానిని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలపై చర్చించాలే తప్ప బహిరంగంగా రోడ్డెక్కడం సరికాదని ఆయన మందలించారని తెలుస్తోంది. ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలని సూచించారు.
'బెజవాడ' గతంలోను చంద్రబాబుకు పలుమార్లు చిక్కులు తెచ్చింది. గతంలో దేవినేని ఉమామహేశ్వర రావు, వల్లభనేని వంశీల మధ్య రచ్చ రోడ్డుకెక్కింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు సీటు కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా కాకముందే బెజవాడ టీడీపీలో చిచ్చు రచ్చకెక్కింది. నాని మంత్రి దేవినేని పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు నక్కజిత్తుల రాజకీయాలు తెలియవని, రాజకీయాల్లో తాను సింహంలాంటివాడినని చెప్పారు. ఆర్నెళ్ల పాలన పైన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
విజయవాడ క్రైం సిటీ కాదని, ముంబై, ఢిల్లీల్లోనే నైట్ అదుపు చేసే కార్యక్రమాలు లేవని చెప్పారు. ఈ ఆరు నెలల కాలంలో విజయవాడకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారుల తీరుపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేవినేని తమను సంప్రదించకుండానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్పైనా నాని ఘాటైన విమర్శలు గుప్పించారు.