కెసిఆర్ను వ్యభిచారమన్నాడు: బాబు ఇప్పుడు చేసిందేమిటి?
కెసిఆర్ తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతూ అది రాజకీయ వ్యభిచారమన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారనే ప్రశ్నను ఎదుర్కుంటున్నారు.
విజయవాడ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన నలుగురు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావుకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు.
వారంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. తమ పదవులకు వారు రాజీనామాలు కూడా చేయలేదు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు.
ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఆ తర్వాత పలువురు టిడిపి ఎమ్మెల్యేలను తెరాసలో చేరారు. ఆ సమయంలో కెసిఆర్పై తెలుగుదేశం నాయకులు దుమ్మెత్తి పోశారు.
జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు చంద్రబాబు...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే పారటీ మారిన సందర్భంలో చంద్రబాబు కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుగా, రాజకీయ వ్యభిచారంగా వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ ఉల్లంఘన కాదా అన్నారు...
"తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి? తెలుగుదేశంలో పోటీ చేసి గెలిచి, కనీసం రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మనల్ని తిడుతూ వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్లూ అని అడుగుతున్నా! ఇది న్యాయమా! ప్రజలకు ఆమోదమా?" అని చంద్రబాబు అన్నారు.
కెసిఆర్పై చంద్రబాబు ఇలా....
".... మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫామ్హౌస్కు తీసుకుపోయి డబ్బులిచ్చి ఏ మాత్రం సిగ్గుపడకుండా పోలీసు ప్రొటెక్షన్తో తీసుకుని వెళ్లిన నీకు నీతి గుర్తుకు రాలేదా? అని అడుగుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం. నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి" అని చంద్రబాబు కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు.
సరుకుల్లా కొన్నారని చంద్రబాబు వ్యాఖ్య
తమ పార్టీ శాసనసభ్యులను కెసిఆర్ తెలంగాఛణ సరుకుల్లా కొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దమ్ముంటే రాజీనామా చేయించి పోటీ చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. ఇప్పుడు చంద్రబాబు ఆ మాటలను మరిచిపోయారనే విమర్శలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. తాను చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరోటా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.