కేసీఆర్ ఔదార్యం: పనిమనిషి పెళ్లికి అంతా తానై!, కానుకగా ఫ్లాట్..
ఈ సందర్భంగా సీఎం 12తులాల బంగారంతో పాటు ఒక చక్కని ఫ్లాట్ ను కొత్త జంటకు అందజేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆయన నివాసంలో పనిచేసే సతీష్ అనే యువకునికి అంతా తానై వివాహం జరిపించారు. ఆదివారం నాడు ప్రగతి భవన్లోని జనహితలో ఈ వివాహవేడుకను నిర్వహించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొండేరు సతీశ్.. సీఎం ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ కు సమయానికి మందులు ఇచ్చే బాధ్యత కూడా ఇతనిదే. చాలాకాలంగా తమ కుటుంబంతో కలిసిపోయిన వ్యక్తి కావడంతో.. కేసీఆర్ కుటుంబం అతని వివాహాన్ని ఘనంగా జరిపించింది.
12తులాల బంగారం, ఒక ఫ్లాట్!:
సీఎం దంపతులే పెళ్లి పెద్దలై అంతా దగ్గరుండి చూసుకున్నారు. ఎంపీ కవిత కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం 12తులాల బంగారంతో పాటు ఒక చక్కని ఫ్లాట్ ను కొత్త జంటకు అందజేశారు. ఈ వివాహా కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.
కేసీఆర్ కుటుంబంతో అనుబంధం:
చాలాకాలంగా సీఎం ఇంట్లో పనిచేస్తుండటంతో.. కొండేరు సతీష్ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు చూరగొన్నట్లు తెలుస్తోంది. సీఎం కుటుంబంతో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే.. స్వయంగా కేసీఆర్ దంపతులే అతని పెళ్లి వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది.
12సంవత్సరాలుగా కేసీఆర్ ఇంట్లో:
కొండేరు సతీష్ గత 12సంవత్సరాలుగా.. కేసీఆర్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఇంట్లో మనిషిగా భావిస్తారని చెబుతారు. అందువల్లే అతని పట్ల ఈవిధంగా అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది.
సత్యవతి రాథోడ్ కుమారుడి వివాహం:
ఆదివారం నాడు కేసీఆర్ దంపతులు మరో వివాహానికి కూడా హాజరయ్యారు. ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్లో జరిగిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కుమారుడి వివాహానికి కేసీఆర్ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.