కాంగ్రెస్ పార్టీకి చెక్: నల్లగొండ నుంచి పోటీకి కేసీఆర్ ప్లాన్?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ స్థానంతోపాటు నల్లగొండ జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు పోటీ చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ స్థానంతోపాటు నల్లగొండ జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు పోటీ చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.
తాను స్వయంగా నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహం రూపొందించారా? తద్వారా ఆ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టవచ్చునని యోచిస్తున్నారని అధికార పార్టీ వర్గాల కథనం.
ప్రత్యేకించి గత నాలుగైదు రోజులుగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయనే యాదృచ్ఛికంగా ఈ సంగతి చెప్పారని అంటున్నారు.
ఒక మిత్రుడి నుంచి ఆరా..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులతో రాజకీయంగా, వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. వారిలోని ఓ మిత్రుడు ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసినప్పుడే నల్లగొండ జిల్లా నుంచి పోటీ విషయాన్ని కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారని తెలుస్తోంది. ఆ జిల్లా రాజకీయాలతోపాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజల్లో తన పాలనపై గల అభిప్రాయం, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర విషయాలపైనా ఆ మిత్రుడి అభిప్రాయాన్నీ తెలుసుకున్నట్లు వినికిడి. ‘నేను ఈసారి ఎలాగూ రెండు చోట్ల పోటీ చేస్తాను. నల్లగొండ జిల్లా నుంచి చేద్దామనుకుంటున్నా.. అలా పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా'అని సీఎం కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండపై దృష్టి సారించినట్టు అర్థమవుతోందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.
పోటీ వెనుక భారీ వ్యూహం
నల్లగొండ జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానం కూడా పోటీ చేయాలన్న సీఎం కేసీఆర్ యోచన వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలకు పట్టు ఉంది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అటు కాంగ్రెస్ కూడా దీటైన ఫలితాలు సాధించింది. ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ మద్దతిచ్చిన సీపీఐ అభ్యర్థి రవీంద్ర కుమార్ (దేవరకొండ) గెలుపొందారు. సీపీఐ ఎమ్మెల్యేతోపాటు మిర్యాల గూడ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. అది వేరే సంగతి.
కాంగ్రెస్ దిగ్గజాలు నల్లగొండ నుంచే
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకుల్లో కే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి, సీఎల్పీ ఉపనాయకుడిగా కోమటిరెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పదవుల్లో ఉన్నారు. ఈ ముగ్గురు అధికార టీఆర్ఎస్పై వీలున్నప్పుడల్లా నిప్పులు చెరుగుతున్నారు. జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కేడర్లోనూ ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఓడిపోయింది. ఇది టీఆర్ఎస్ శ్రేణులతో పాటు సీఎం కేసీఆర్ను కూడా ఆలోచనలో పడేసింది.
పార్టీ బలోపేతమే కేసీఆర్ వ్యూహం
ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా.. కొంతమేర స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత కాన వస్తోంది. సీఎం కేసీఆర్ చేయించిన సర్వేల్లోనే ఈ సంగతి బయటపడింది. అందులోనూ పాత నల్లగొండ జిల్లా పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల టీఆర్ఎస్ నేతల గ్రాఫ్ పడిపోగా, మరోవైపు కాంగ్రెస్ నేతల గ్రాఫ్ మెరుగుపడింది. ఇక పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గ్రూపు గొడవలు, సరైన నాయకత్వం లేకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో పార్టీ బలాన్ని, ఊపును పెంచేందుకు సీఎం కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారని, అందులో భాగంగా అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నా రని తెలుస్తోంది.