మార్చండి!: మోడీతో మనసు విప్పి మాట్లాడిన కెసిఆర్
హైదరాబాద్: పాలనలో మీ మార్క్ కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీతో కెసిఆర్ మనసు విప్పి అన్ని విషయాలను మాట్లాడారని అంటున్నారు.
పాలనలో మీ ముద్ర కనిపించడం లేదని ప్రధాని మోడీతో అన్నారని చెబుతున్నారు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయ్యాయని, అయినప్పటికీ మీ ముద్ర తెలిపే పథకం ఒక్కటీ లేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. శాశ్వతంగా నిలిచే పథకాలను ప్రారంభించాలని సూచించారు.
అన్ని రాష్ట్రాలలోను ఎయిమ్స్ నిర్మించాలని చెప్పారు. నేను ఓపెన్ మైండుతో మీతో మాట్లాడుతానని, మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నానని, ఇంత వరకూ మీ మార్క్ పాలనల మాకు కనిపించలేదని, 'మోడీ మార్క్' పాలన అనే విధంగా చేయాలని, అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారని చెప్పారని తెలుస్తోంది.
ప్రధాని మోడీని కెసిఆర్ శుక్రవారం కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనసు విప్పి మాట్లాడారని, ఎన్నో సూచనలు చేశారని తెలుస్తోంది. విభజన సమస్యలు, తెలంగాణకు కావాల్సినవి అడగటంతో పాటు మోడీ మార్క్ పాలన గురించి కూడా మాట్లాడారని తెలుస్తోంది.
అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాకు తెలంగాణకు ఒక్కసారి కూడా రాలేదని కెసిఆర్ ప్రధాని మోడీతో చెప్పారు. దానికి జనవరిలో వద్దామనుకున్నానని, రాలేకపోయానని, త్వరలో వస్తానని చెప్పనట్లుగా తెలుస్తోంది. కెసిఆర్ మాటలను శ్రద్ధగా విన్న ప్రధాని మోడీ ఆయన సలహాలను స్వాగతించారని తెలుస్తోంది.