కోమటిరెడ్డి కుమారుడిది హత్యనా?: కారు వెనకభాగం నుజ్జు
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం హతమైన నేపథ్యంలో, అతని కేసులను విచారిస్తున్న క్రమంలో కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి మృతి తెర మీదికి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కారు ప్రమాదంలో మరణించలేదా, నయీం అతన్ని హత్య చేశాడా అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి.
'అడిగిన మొత్తం ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుణ్ని చంపినట్లే నీ పిల్లల్ని చంపుతా'నంటూ నయీం భువనగిరికి చెందిన వ్యాపారిని బెదిరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజంగా నయీమే కోమటిరెడ్డి కుమారుడిని చంపాడా, ఆ సంఘటనను నయీం తనకు అనుకూలంగా వాడుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రోడ్డు ప్రమాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి మృతి
ఐదేళ్ల క్రితం జరిగిన కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి యాక్సిడెంట్ కేసు భువనగిరి వ్యాపారి నాగేంద్ర ఫిర్యాదుతో మళ్లీ తెర మీదికి వచ్చింది.
2011 డిసెంబరు 20న ప్రతీక్రెడ్డి తన స్నేహితులైన సుజితకుమార్, ఆరవ్రెడ్డి, చంద్రారెడ్డితో కలిసి స్కోడా కారు(ఏపీ 24 ఏహెచ 9999)లో గండిపేట్ నుంచి పటానచెరు వైపు బయలుదేరారు. కొల్లూరు గ్రామ ఔటర్రింగ్ సర్వీసు రోడ్డు వద్ద గొర్రెల మంద అడ్డు రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు వేగంగా రోడ్డు నుంచి కిందకు దూసుకెళ్లింది.
కారు 30 అడుగుల ఎత్తుకు ఎగిరి పల్టీలు కొడుతూ పడటంతో కారు నడుతుతున్న చంద్రారెడ్డితోసహా ప్రతీక్రెడ్డి, సుజిత అక్కడే మృతి చెందారు. మృతదేహాలు 100 మీటర్ల దూరం చెల్లాచెదురుగా పడ్డాయి. ఆరవ్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో మితిమీరిన వేగం వల్ల కారు అదుపులోకి రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అనుకున్నారు.
రింగురోడ్డు పైకి గొర్రెల మందను కావాలనే తోలారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో కారు వెనుకభాగం.. ఏదో వాహనం గుద్దినట్లు ఎలా నుజ్జునుజ్జు అయిందనేది కూడా ప్రశ్నగానే మిగిలిందని అంటున్నారు. 2011 డిసెంబరు 20న జరిగిన ఈ ప్రమాదానికి సంబధించి పోస్టుమార్టం నివేదిక, ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఆధారంగా.. 2012 ఏప్రిల్ 29న పోలీసులు కేసును మూసేశారు.
అయితే, ప్రతీక్ రెడ్డి కారుకు జరిగింది ప్రమాదమేనని, అయితే ఆ ప్రమాదాన్ని గ్యాంగ్స్టర్ నయీం తనకు అనుకూలంగా మార్చుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారి నాగేంద్రను బెదిరించి డబ్బు వసూలు చేసేందుకే కోమటిరెడ్డి కుమారుడి మరణం గురించి ప్రస్తావించి ఉంటాడని భావిస్తున్నారు. నయీం కేసుల తదుపరి దర్యాప్తులో భాగంగా.. అవసరమైతే ఈ యాక్సిడెంట్ కేసును అధికారులు మరోసారి పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.
కాగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ కాల్స్పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు ఏమీ తేల్చలేకపోయారుృని అంటున్నారు. ఇది నయీం కారణంగానే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.