తండ్రి చాయ్ అమ్ముకునే కోర్టుకే జడ్జీగా కూతురు
న్యూఢిల్లీ: కృషి ఉంటే మనం సాధించాల్సిన గమ్యాన్ని ఏ పరిస్థితులు అడ్డుకోలేవని నిరూపించారు ఓ యువతి. ఓ కోర్టులో ఆమె తండ్రి చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా ఉన్నప్పటికీ ఎంతో శ్రమ, పట్టుదలతో ఉన్నత చదువులు చదివి అదే కోర్టుకి జడ్జీగా నియమితులయ్యారు ఆమె.
వివరాల్లోకి వెళితే.. సురేందర్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని నకోదార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందరు తండ్రుల లాగే తన కూతురుకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కలలు కన్నాడు.
అతను కన్న కలలను నిజం చేస్తూ ఆ కూతురు అతనికి అంతులేని ఆనందాన్నిచ్చింది. అయితే, తను చాయ్ అమ్ముతున్న కోర్టుకే ఆమె న్యాయమూర్తిగా వస్తుందని అతను ఎన్నడూ ఊహించలేదు.
23ఏళ్ల సురేందర్ కూతురు శృతి ఇటీవలే పంజాబ్ సివిల్ సర్వీసెస్(జుడీషియల్) పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాతే ఏడాది అకాడమీ శిక్షణ అనంతరం ఆమె తన తండ్రి టీ అమ్ముకునే కోర్టుకే జడ్జీగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా శృతి మీడియాతో మాట్లాడుతూ.. తన కల నిజమైందని తెలిపారు. ‘తాను న్యాయవ్యవస్థలోనే స్థిరపడాలని కోరుకున్నా. జడ్జీ కావాలనే కలలు కన్నా. పరీక్షలకు కోసం పటిష్టంగా సిద్ధమై ఎస్సీ కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచా' అని తెలిపారు.
కాగా, గత గురువారం స్థానికులు శృతిని సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపి, బిజెపి ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా ఆమెను అభినందించారు. పంజాబ్కు దక్కిన గౌరవమని అన్నారు.