దూరదర్శన్ లేడీ యాంకర్ తప్పుల మీద తప్పులు
న్యూఢిల్లీ: దూరదర్శన్ మహిళా యాంకర్ తన నోటి వెంట తప్పుల మీద తప్పులు దొర్లించారు. గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ ఆమె నోటి వెంట ధారాళంగా ప్రవహించింది. దీంతో దూరదర్శన్కు తలనొప్పి వచ్చి పడింది. దానికితోడు మహిళా గవర్నర్ను అతడు అంటూ సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేశారు.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) నవంబర్ 20వ తేదీన గోవాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన వద్ద ఉన్నారని చెబుతూ ఆయన తన అభిప్రాయాలను మనతో పంచుకుంటారంటూ నొక్కి వక్కాణించారు.
ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, పొరపాటును సరిచేసుకుని నాలుగు నిమిషాల తర్వాత తిరిగి ప్రసారం చేశామని డిడి ఉన్నతాధికారి ఒకరు అన్నారు. జరిగిన తప్పునకు గల కారణాలను తెలుసుకునేందుకు ఎడిజి స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ సంబోధించిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని చెప్పారు. ఆమె సరిగా సిద్ధం కాలేదని చెప్పారు.
ఇంతకు ముందు కూడా దూరదర్శన్కు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేరులోని ఎక్స్ఐని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్గా పలకడంతో డిడిపై విమర్శలు వ్చచాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసిన ఉదంతం కూడా ఉంది.