'వారికి 4 కోట్లు, మాకు 3 కోట్లు: కెసిఆర్ మైండ్గేమ్'
హైదరాబాద్: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ముందు పూర్తి చేయాలని, అప్పటి వరకు ఆయకట్టు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ శనివారం అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టుల బాట ముగింపులో భాగంగా పార్టీ నేతలు జిల్లాలోని నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను సందర్శించారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డికె అరుణ విలేకరులతో మాట్లాడారు. గత బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయించి నిధుల్లో నాల్గోవంతు కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు.
రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే 7.91 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని, దానిని వదిలి పెట్టి పాలమూరు పథకానికి ఏటా రూ.13వేలకోట్లకు పైగా కేటాయించడం కెసిఆర్కే చెల్లిందన్నారు.
అసంపూర్తి ప్రాజెక్టులకు నిధులు విడుదల కావడం లేదని, అదనపు చెల్లింపుల జీవో పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు విధానంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు.
పంచాయతీరాజ్ శాఖ మట్టిరోడ్ల నిర్మాణానికి పాలమూరు జిల్లాకు రూ.58 కోట్లు ఇవ్వగా.. అందులో మంత్రుల నియోజకవర్గాలకు రూ.6 కోట్లు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూ.4 కోట్లు ఇచ్చారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూ.3 కోట్లే ఇచ్చారన్నారు. ఇదంతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్లోభ పెట్టేందుకు ఆడుతున్న ఆటలో భాగమన్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం నాడు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, యువతకు తెరాస ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు.
వారికిచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అమరుల కుటుంబాలకు సరిగా సాయం అందలేదని ప్రాణత్యాగాలను విస్మరించారన్నారు. వచ్చే నెలలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకొని వారు భేటీ అయ్యారు. ఉస్మానియా విద్యార్థులతో మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించారు.