ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?
న్యూఢిల్లీ: జులై 22 (శుక్రవారం) ఈరోజు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అవుతుందా? బిల్లుపై ఓటింగ్ జరుగుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఢిల్లీలో హీటెక్కిన ఆంధ్ర రాజకీయం: కేవీపీ బిల్లుకు కనిమొళి మద్దతు
బిల్లు పాస్ అయితే ఫలితం ఎలా ఉండబోతుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రైవేటు సభ్యుల బిల్లుల బిజినెస్ ప్రారంభం కానుంది. మొదట 13 కొత్త ప్రైవేటు బిల్లులను కొంతమంది సభ్యులు ప్రవేశపెట్టిన తరువాత 14వ అంశంగా కేవీపీ బిల్లును ఎజెండాలో చేర్చారు.
రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు పాసవ్వడం అసాధ్యమని కొందరు వాదిస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం బిల్లు పాస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. జాతీయ పార్టీలకు చెందిన నేతలకు కూడా కలిసి బిల్లుకు మద్దతు కోరారు. మరోవైపు కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాం పన్నిందని అంటున్నారు. మరోవైపు రాజ్యసభలో ఓటింగ్ లేకుండా బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించాలంటూ కేవీపీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఈ బిల్లు విషయం ఏమవుతుందోనని యావత్ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?
అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్, ఆయన సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఎస్.ఎ్స.ఆహ్లువాలియాలతో పాటు ఇంకొందరు మంత్రులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. బిల్లుపై ఓటింగ్కు కేవీపీ పట్టుబడితే అధికారపక్షం సభ్యులు వ్యతిరేకించకుండా మిన్నకుంటే సరిపోతుందని కొందరు బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.
ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?
'ఓటింగ్ను ఎవరూ వ్యతిరేకించకపోతే మూజువాణి ఓటుతోనే బిల్లు నెగ్గుతుంది. అప్పుడు బిల్లుకు ఎవరు అనుకూలంగా ఓటేశారో, ఎవరు వ్యతిరేకంగా ఓటేశారో తెలియదు. బిల్లు నెగ్గినా దానివల్ల ఒరిగేదేమీ లేనప్పుడు దానిగురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం' అని మరికొందరు బీజేపీ నేతలు అంటున్నారు.
ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?
ఒకవేళ రాజ్యసభలో కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లు నెగ్గితే ఆ తర్వాత జరిగే పరిణామాలపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా బీజేపీ నాయకత్వం సేకరించింది. ప్రైవేట్ బిల్లును ప్రభుత్వం స్వీకరించిన నేపథ్యంలో సంబంధిత మంత్రి ఉభయసభల్లో ప్రభుత్వ బిల్లుగా ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే విభజన చట్టంలో సవరణలు చేయాలే తప్ప రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు నెగ్గినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు సలహా ఇచ్చారు.
ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?
ఈ క్రమంలో శుక్రవారం కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రాజ్యసభలో కేవీపీ బిల్లు నెగ్గినా లోక్సభలో ఇంకొరు దీనిని మళ్లీ ప్రైవేట్ బిల్లుగా పెట్టాల్సి ఉంటుంది. అక్కడ కూడా బిల్లు నెగ్గితేనే ప్రభుత్వం దానికి చట్టబద్ధత తీసుకువస్తుందని అంటున్నారు.
కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడతాయా? లేక బిల్లు వీగుతుందా? అనే ప్రశ్నలు సగటు మానవునిలో ఉదయిస్తున్నాయి. కాగా మొత్తం మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీయేకు 72 మంది సభ్యులున్నారు. బీజేపీ 54, టీడీపీ 6, శిరోమణి అకాలీ దళ్ 3, శివసేన 3, పీడీపీ 2, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలే), సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు.
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న యూపీఏ తరుపున 66 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్కు 60, డీఎంకే 4, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ల తరుపున ఒక్కో సభ్యుడు ఉన్నారు. జనతా పరివార్ పార్టీకి 15 మంది సభ్యుల బలముండగా, జనతాదళ్ తరఫున 10 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 3, ఇండియన్ నేషనల్ లోక్దళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు.
ఇక రాజ్యసభలో ఇతర పార్టీలైన సమాజ్ వాదీ 19, అన్నాడీఎంకే 13 తృణమూల్ కాంగ్రెస్ 12, బిజూ జనతాదళ్కు 8, సీపీఐ (ఎం)కు 8, బీఎస్పీకి 6, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి 5, టీఆర్ఎస్కు 3, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వైసీపీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు. వీరితో పాటు 10 మంది నామినేటెడ్ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండగా, ఒక సీటు ఖాళీగా ఉంది.
మరోవైపు కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుతో ఎటువంటి భయం లేదని ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు కావాలని గతంలో విభజన బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పట్టుపట్టారు.
ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో చేర్చాలంటూ అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ కూడా సవరణలు చేపట్టి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ప్రత్యేక హోదాకు ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో ఈ బిల్లుకు మద్దతివ్వాలో, వ్యతిరేకించాలో బీజేపీ సభ్యులకు అర్థం కావడం లేదు. ఆ పార్టీ నాయకత్వం కూడా దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది.
శుక్రవారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ సీనియర్ నేతల కీలక సమావేశం జరగనుంది. నిజానికి ప్రతిరోజూ వీరు సమావేశమై ఆ రోజు ఉభయసభల్లో ఉన్న ఎజెండాలను పరిశీలించి వాటిపై ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అదేవిధంగా కేవీపీ బిల్లుపైనా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.