రవితేజ విచారణ సీక్రెట్: పూరీ, తరుణ్ పరిస్థితి ఏమిటి?
హైదరాబాద్: డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తోంది. కేవలం సినీ ప్రముఖులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారనే విమర్శలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఖండిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు విచారణకు నోటీసులు అందుకున్న వారంతా సినీ పరిశ్రమకు చెందినవారే కావడం విశేషం.
ఐదు రోజులుగా సాగుతున్న సినీ ప్రముఖుల విచారణ సినీ పరిశ్రమ గుట్టు విప్పుతోంది. సిట్ విచారణలో వెల్లడవుతున్న అంశాలు తెలుగు సినీ పరిశ్రమలోని చాలామందికి మింగుడు పడడం లేదు. మరో ఇద్దరు యువ నటులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు సిట్ దర్యాప్తులో బయటకు రావడం మరింత సంచలనానికి కారణమైంది.
డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్, అతడి సహచరుడు ఈవెంట్ మేనేజర్ జీషాన్ అలీ అలియాస్ జాక్ల నుంచి పోలీసులు కీలకమైన సమాచారం రాబట్టినట్టు ప్రచారం సాగుతోంది. కెల్విన్ కాల్డేటా ఆధారంగా కొంతమంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన సిట్ అధికారులు, జాక్ ద్వారా వెల్లడైన సమాచారంతో ఇద్దరు యువ నటులతో పాటు బుల్లితెర నటులకు కూడా డ్రగ్స్ సరఫరా జరిగినట్టు సిట్ గుర్తించింది. దీంతో టాలీవుడ్, బుల్లితెర నటీనటుల్లో గుబులు ప్రారంభమైంది.
రవితేజ విచారణపై సీక్రెసీ...
ముందస్తు ప్రణాళిక ప్రకారం సిట్ ముందు హీరో రవితేజ మంగళవారం హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్ అధికారుల ముందు మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా హాజరయ్యారు. రవితేజను విచారించే విషయాన్ని సిట్ అధికారులు రహస్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రవితేజ ఎప్పుడు సిట్ ముందుకు వస్తారనే విషయంపై స్పష్టత లేదు.
Recommended Video
పూరీపై ఇలా ప్రచారం..
వారం రోజుల్లోగా ప్రముఖ సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు తరుణ్లను అరెస్టు చేసే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ పత్రిక వార్తకథనాన్ని ప్రచురించింది. పూరి, తరుణ్ డ్రగ్స్ తీసుకుంటారని అనుమానిస్తున్న సిట్ అధికారులు వీరి రక్తం, వెంట్రుకలు, లాలాజలం, చేతి గోళ్లు శాంపిల్స్ను సేకరించారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు రాగానే, వీరు డ్రగ్స్ వాడుతున్నట్టు తేలితే.. వీరిని అరెస్టు చేస్తామని సిట్ అధికారులు అన్నారు.
ముమైత్ ఖాన్ విచారణపై స్పష్టత
కేసు విచారణలో ఇప్పటికే ఓ తేదీ మారిన ఐటెమ్ సాంగ్ గర్ల్ ముమైత్ఖాన్ ఎంట్రీపై స్పష్టత వచ్చేసింది. బిగ్బాస్ రియాలిటీ షోలో ఉన్న ముమైత్ ఖాన్ ఈనెల 27న సిట్ అధికారుల ముందుకు వస్తారని అంటున్నారు. నోటీసులు అందుకున్నవారందరి విచారణ తేదీలను మొదటే ఖరారు చేశారు అయితే, ముమైత్ఖాన్కు మాత్రం మొదట మినహాయింపు ఇచ్చారు. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. చివరికి బిగ్బాస్ రియాల్టీషోలో ఉన్న ముమైత్కు నోటీసులు పంపారు. ఈ మేరకు ఆమె విచారణ నిమిత్తం సిట్ అధికారుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
పూరీ కోసమేనా...
పూరీ జగన్నాథ్ కోసం తెప్పించే డ్రగ్స్ హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్లకు కూడా చేరేవని జీషాన్ అలీ సిట్ అధికారుల విచారణలో వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. నవదీప్, రవితేజతో పాటు సినీ రంగంలో చాలా మందికి కొకైన్ ఇచ్చానని అతను చెప్పినట్టు సమాచారం. కొకైన్ కోసం ఫోన్ చేసిన వారికి తమ ముఠా సభ్యుడు విలియమ్తో డ్రగ్స్ను పంపిణీ చేసేవాడినని జీషాన్ అలీ అంగీకరించినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
అరెస్టుల పర్వం ఇలా...
డ్రగ్స్ కేసులో ఆగస్టు మొదటి వారం నుంచి అరెస్టులు ప్రారంభమవుతాయని అంటున్నారు. సిట్ విచారణకు హాజరైన వారిలో కొందరు అరెస్టయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు విచాణ జరిపిన వారితోపాటు మరికొంత మందిని ఆగస్టు మొదటి వారంలో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.
మరో కీలక వ్యక్తి....
కెల్విన్లాగే డ్రగ్స్ దందా చేసే మరో కీలక వ్యక్తి నవ్యంత్ కోసం సిట్ గాలిస్తున్నట్లు సమాచారం. కెల్విన్తో పోటీ పడి అతను డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్కు చెందిన నవ్యంత్ ఉన్నత చదువులు చదువుతూనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్ పోలీసులు కొద్ది రోజుల క్రితం అతని ఇంటిపై దాడిచేశారు. ఆ సమయంలో నవ్యంత్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. సిట్ వరుస దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
డిజిపితో సబర్వాల్ భేటీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అనురాగ్ శర్మను సోమవారం రాత్రి కలిశారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు నేపథ్యంలో తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి, డ్రగ్స్ కేసులో కొనసాగుతోన్న విచారణకు సంబంధించి వివరాల గురించి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సిట్ సేకరించిన ఆధారాలు వంటి వాటి నివేదికను డిజిపి అనురాగ్ శర్మకు అందించారు. కేసులో కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని, అయితే తమకు అధికారికంగా పత్రాలు రాలేదని సబర్వాల్ తెలిపారు.